అంకెల గారడీ చేస్తున్న చంద్రబాబు



హైదరాబాద్: అంకెలతో చంద్రబాబు ప్రభుత్వం గారడీ చేస్తోందని వైఎస్సార్సీపీ
ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. దేశ వృద్ధి రేటు 7 శాతం ఉంటే ఏపీలో  15 శాతం వృద్ధి రేటు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
వృద్ధి రేటు లెక్కగట్టడం చంద్రబాబుకు తెలుసా అని నిలదీశారు. హైదరాబాద్ లోటస్ పాండ్
లోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ ను టీడీపీ ప్రభుత్వం అడ్డదిడ్డంగా దోచేస్తోందని వైఎస్సార్ సీపీ
ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. 15 శాతం వృద్ధి నమోదు చేస్తామని ముఖ్యమంత్రి
చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

టీడీపీ పాలనలో
వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ రంగం కుదేలయ్యాయని తెలిపారు. చంద్రబాబు గత పాలనలో వృద్ధి రేటు సింగిల్
డిజిట్ దాటలేదని గుర్తు చేశారు.

 రైతు ఆత్మహత్యలు, అత్యాచారాలు, మహిళలను కించపరచడంలో టీడీపీ సర్కారు నంబర్ వన్ గా నిలిచిందని ఎద్దేవా చేశారు.
జీతాలు పెంచమని అడుగుతున్న అంగన్ వాడీ వర్కర్లను పోలీసులతో కొట్టించారని, సూదులతో గుచ్చారని ఆమె ఆరోపించారు.

టీడీపీ నాయకులు
సైకో సూదిగాళ్ల మాదిరిగా తయారయ్యారని దుయ్యబట్టారు. అంగన్ వాడీ వర్కర్లంటే ఎందుకంత
చిన్నచూపు అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మార్వోను నోటికి వచ్చినట్టు తిట్టిన
ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు వెనకేసుకొచ్చారని చెప్పారు.
చంద్రబాబుకు ఆడపిల్లలు లేరుకాబట్టే మహిళల బాధలు పట్టడం లేదని రోజా ధ్వజమెత్తారు.

Back to Top