ఓటమి భయంతోనే శిల్పాపై బాబు ఆరోపణలు

నంద్యాల: ముఖ్యమంత్రికి  ఫ్రస్టేషన్‌ పీక్‌ స్టేజికి చేరిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. అందుకే ఓటమి భయంతో శిల్పా మోహన్‌ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారమిక్కడ మాట్లాడుతూ...‘ నిన్నటివరకూ శిల్పా మోహన్‌ రెడ్డి మంచోడు. టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌ సీపీలో చేరగానే విమర్శల చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. గతంలో భూమా నాగిరెడ్డిని విషవృక్షం అన్న చంద్రబాబు ఇప్పుడు అదే భూమాను పొగుడుతున్నారు. మామను వెన్నుపోటు పొడిచినప్పుడు ఎన్టీఆర్‌ను ఇలానే విమర్శించారన్నారు. మైనార్టీల అభివృద్ధి గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 

మైనార్టీలకు వైయస్‌ రాజశేఖరరెడ్డి మూడు మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లను అందించిన ఘనత వైయస్‌ఆర్‌దేనన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించిన ఏకైక సీఎం వైయస్‌ఆర్‌. సాయం చేసిన వైయస్‌ఆర్‌ను మైనార్టీలు ఎప్పటికీ మరిచిపోరని రోజా అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 20మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలన్నారు. తన అవినీతి పాలనకు ఓట్లు రావు కాబట్టే..నంద్యాలలో రూ.కోట్లు పంపిణి చేసి కొనాలనుకుంటున్నారు’ అని ధ్వజమెత్తారు.
Back to Top