<br/><br/>గుంటూరుః భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ ఆమోదం పొందిన నవంబర్ 26ను పండుగలా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ మోహన్రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుంటూరులో అంబేద్కర్ చిత్రపటానికి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తాఫా, మాజీ ఎమ్మెల్యే సుచరిత, నాయకులు కిలారి రోశయ్య, యేసురత్నం తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ చరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేందుకు తమ అధినేత వైయస్ జగన్ పిలుపునిచ్చారని చెప్పారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపినట్లు నాయకులు తెలిపారు. రాజ్యాంగం గురించి తెలుసుకునేందుకు ఈ ప్రత్యేక రోజు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతుందని ఆకాంక్షించారు. మనం అంతా గర్వించదగిన రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఆవిశ్రాంతంగా శ్రమించిన గొప్ప మేధావులకు ఘనమైన నివాళి అందించేందుకే ఈ ప్రత్యేక దినం అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషిని గుర్తుచేసుకోకుంటే మన రాజ్యాంగం ప్రస్తావనే ఉండదన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆయనకు వందనం తెలిపారు. మన రాజ్యాంగ విలువలను, సిద్ధాంతాలను గౌరవించాలని పిలుపునిచ్చారు.