రాష్ట్ర ప్రజలను బిడ్డల్లా చూసుకున్న వైయస్ఆర్

హైదరాబాద్, 16 డిసెంబర్ 2012:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజలను తన సొంత బిడ్డలుగా చూసుకున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా అన్నారు. ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టి ప్రజల గుండెల్లో ఆయన నిండిపోయారన్నారు. ఆయన ఆడుగు జాడల్లో నడుస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తోడుగా ఉన్నారన్నారు.

     తంబళ్లపల్లి నియోజక వర్గం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదివారంనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా బి.కొత్తకోట గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రోజా మాట్లాడారు. ఆరోగ్యశ్రీ, అభయ హస్తం వంటి అనేక పథకాలు చేపట్టి ప్రజల కోసం పని చేసిన మహానీయుడు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. రాబోయే రోజుల్లో కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకుంటారన్నారు.

అమ్ముడు పోయారనడం సిగ్గుచేటు
కామెర్లు వచ్చిన వారికి ఊరంతా పచ్చగా కనిపిస్తుందన్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని రోజా విమర్శించారు. డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అంటున్న చంద్రబాబు తానెంతకు అమ్ముడు పోయారో చెప్పాలన్నారు. అలాగే ముగ్గురు ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనకుండా ఎంత ఒప్పందం చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారనే అసూయతో అలా మాట్లాడుతున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు అమ్ముడు పోతున్నారని అనడం సిగ్గుచేటని రోజా ఎద్దేవా చేశారు.

Back to Top