రాజన్న రాజ్యం కావాలి!

తాడిమర్రి 26 అక్టోబర్ 2012 : తమ బాగోగులు పట్టించుకోని ఈ పాలన తమకు వద్దని మరో ప్రజాప్రస్థానంలో రైతులు షర్మిలతో మొరపెట్టుకున్నారు. జగనన్న సీఎం కావాలి.. రాజన్న రాజ్యం మళ్లీ రావాలి అంటూ ధర్మవరం నియోజకవర్గంలో పలువురు రైతులు ఆమెతో అన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయనీ, బోర్లు ఎండిపోయాయనీ, పంటలు పాడైపోయాయనీ, పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదనీ రైతులు షర్మిలతో అన్నారు. వైయస్ ఉన్నప్పుడు తమకు మూడుసార్లు పరిహారం అందిందనీ,. ఇప్పుడు పరిహారం ఊసే లేదనీ వారు వాపోయారు. ఇన్‌పుట్ సబ్సిడీలు లేవనీ,. ఎరువులు అడిగితే ఇచ్చే నాథుడే లేడనీ. అనంతపురం జిల్లాలో బుధ, గురువారాల్లో ధర్మవరం నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర సాగుతుండగా పలు చోట్ల రైతులు ఎండిపోయిన తమ పంటలను ఆమెకు చూపి గోడు వెళ్లబోసుకున్నారు.
అనంతపురం జిల్లా తమ్మాపురంలో తమకు బీమా వర్తింపజేయడం లేదని టమాటా రైతులు, తుమ్మల క్రాస్‌రోడ్డు వద్ద వేరుశనగ రైతులు తమ కష్టాలు చెప్పుకున్నారు.. దీనికి స్పందించిన షర్మిల తమ్మాపురం బహిరంగ సభలో మాట్లాడుతూ రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందనీ, టమాటాలాంటి పంటలకూ బీమా వర్తింపజేస్తుందనీ అని హామీ ఇచ్చారు. పాదయాత్ర దసరా నాడు తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామం వద్ద 100 కిలోమీటర్ల మైలురాయి దాటగా, గురువారం నాటికి  119.9 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. 'అనంత' జనవాహిని ఆమె వెంట ఉత్సాహంగా అడుగులు వేస్తుంగా షర్మిల చెరగని చిరునవ్వుతో ఆత్మీయంగా అందరినీ పలకరిస్తూ మును ముందుకు సాగుతున్నారు. బుధవారం ఉదయం 10.35కు దాడితోట శివారు నుంచి బయలుదేరిన షర్మిలను చిల్లకొండాయ పల్లిలో గొర్రెల కాపర్లు కలిసి తమ నీటి కష్టాలపై ఫిర్యాదు చేశారు. దీనిపై పార్టీ తరపున ధర్నా నిర్వహించి సమస్య పరిష్కారానికి పోరాటం చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు. జిల్లా శాసనసభ్యులు గురునాథ్‌రెడ్డి, కాపు రాంచంద్రారెడ్డిలు స్థానిక సమస్యలపై పోరాటం చేస్తామని వారికి హామీ ఇచ్చారు.
దసరా రోజు షర్మిల మొత్తం 15 కిలోమీటర్లు నడిచారు. కాగా గురువారం ఉదయం 9.30కు బయలుదేరిన షర్మిలను.. మార్గమధ్యంలో కలిసిన ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అప్రాచెరువు సమీపంలో భోజన విరామం తీసుకున్న ఆమె  సాయంత్రం 4.30 గంటలకు యాత్ర తిరిగి ప్రారంభించారు. అప్రాచెరువులో స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. రాత్రి 7.40కి తుమ్మల సమీపంలో ఏర్పాటుచేసిన బసస్థలానికి చేరుకున్నారు. పార్టీ నాయకుడు ఎం.వి. మైసూరారెడ్డి గురువారం రోజంతా ఆమె వెంట పాదయాత్రలో పాలుపంచుకున్నారు.

Back to Top