<br/>ప్రభుత్వానికి కనువిప్పు కలగాలిఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి<br/>ఖమ్మంః రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలు, బాధలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకే నిరసనదీక్ష చేపట్టినట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం పట్టణ ప్రజలు దుర్భిక్ష పరిస్థితుల్లో జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దేశంలో ఎక్కడ జరగని విధంగా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే పాలన ఏవిధంగా అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్న ధృడసంకల్పంతోనే నిరాహార దీక్షకు దిగానన్నారు. <br/>దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఖమ్మంలో 4వేల 600 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని పొంగులేటి స్పష్టం చేశారు. ఇచ్చిన పట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయని... వారికి స్థలాలు కేటాయించడంలో తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పిన కేసీఆర్... అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నాసాధించేమీ లేదన్నారు. రాష్ట్రంలో 400 ఇళ్లకు మించి ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. <br/>ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 400 చొప్పున డబుల్ బెడ్ రూంలకు ఏర్పాటు చేసుకోవాలన్న ప్రభుత్వం...అవి ఏమూలకు సరిపోతాయని పొంగులేటి ప్రశ్నించారు. గిరిజనులు, వెనుకబడిన పేదలకు ఎన్ని వస్తాయని నిలదీశారు. ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 4 వేలు కట్టించాలని, ఖమ్మం పట్టణంలో 10 వేల ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మహానేత హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రతి ఒక్కరికీ స్థలాలు కేటాయించాలన్నారు. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దిగిరాని సమక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనుకాడనని పొంగులేటి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.