ఫీజు రీయింబర్సుమెంటులో పరిమితులు వద్దు

విద్య వల్లే మార్పు సాధ్యమవుతుందని ఊదరగొడుతున్న ప్రభుత్వం.... మరోవైపు ఉన్నత విద్యను అందరికీ అందించే విషయంలో మాత్రం సర్కార్ మాటలకే పరిమితమవుతోంది. విద్యా రంగంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల ఉన్నత విద్య లక్ష్యమే దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది.
పెద్ద చదువులు చదివే హక్కు పేదలందరికి ఉందనే నినాదంతో విజయమ్మ దీక్షకు దిగారు.  ఫీజు రీయింబర్సుమెంట్పై ఎలాంటి పరిమితులు లేకుండా కొనసాగించాలని ఆమె  డిమాండ్ చేస్తన్నారు. చదువును సామాజిక పెట్టుబడిగా భావిస్తూ వైఎస్ ప్రవేశపెట్టిన ఈ పథకం వెనుక ఉద్దేశాన్ని ప్రభుత్వ పెద్దలు గ్రహించలేకపోయారు. వారి  కళ్లు తెరిపించి, ఈ పథకాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి 2011 ఫిబ్రవరి 18 నుంచి 24వ తేదీ వరకూ ఏడు రోజుల పాటు ఇదే ప్రదేశంలో నిరాహారదీక్షను చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒంగోలులో ఈ ఏడాది జనవరి 4న కూడా విద్యార్థుల ఫీజుల సమస్యపైనే ఆయన ఒక రోజు ధర్నా చేశారు. డిమాండ్‌ను సాధించేంత వరకూ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది. మొద్దు నిద్ర పోతున్న సర్కారు మత్తు వదలదని తెలిసినాదాని మెడలు వంచైనా సరే విద్యార్థుల ప్రయోజనాలు కాపాడుతామని ఆ పార్టీ ప్రకటించింది.  పేద, బడుగు వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ఉదాత్తమైన ఆశయంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజుల రీయింబర్సుమెంట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది.
మహానేత లేని ప్రభావమిది
మహానేత లేని ప్రభావం మొదటపడింది ఈ పథకం పైనే. వైఎస్ మరణంతో మానవీయ కోణం మృగ్యమైంది. ఖజానాపై  భారం ఎంతనేదే ప్రధానమైంది. నిరుపేద విద్యార్ధులకు ఉన్నత విద్య అందుబాటులో ఉండాలనీ, చదువుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించినా డబ్బు ఆటంకం కాకూడనీ మహానేత వైఎస్ఆర్‌ తలంచారు. ఆ లక్ష్యాన్ని ఆయన రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం నీరుగార్చేసింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎలాంటి పరిమితులు లేకుండా అర్హులైన పేదలందరికీ ఫీజును చెల్లించడంతో  లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. అలా ఆయన హయాంలో ఈ పథకం కింద లబ్ధి పొంది ఇంజనీరింగ్‌తో సహా పలు వృత్తి విద్యా కోర్సులను పూర్తి చేసుకున్న లక్షలాది మంది విద్యార్థులు ఉన్నతోద్యోగాల్లో చేరి తమ కుటుంబాలకు అండగా నిలబడ్డారు. ఏ సమాజమైనా భావితరాలకు బోధించే విద్యలో జాతి అవసరాలతోపాటు దాని సామాజిక, సాంస్కృతిక వారసత్వం కొనసాగే విధంగా జాగ్రత్త తీసుకుంటుంది. అలా చేస్తేనే ఆ జాతి తన ఉనికిని చాటుకోగలదు. విద్యా రంగంలో ప్రభుత్వం తన బాధ్యత నుంచి  పక్కకు తప్పుకోవాలని చూస్తే అప్పటినుంచి ఆ జాతి సామాజిక, సాంస్కృతిక వారసత్వానికి పతనం మొదలు అయినట్టే.

Back to Top