విజయమ్మ ఆరోగ్యంపై అభిమానుల ఆందోళన

గుంటూరు 23 ఆగస్టు 2013:

  సమన్యాయం చేయాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చేస్తున్న సమర దీక్ష శుక్రవారానికి అయిదో రోజుకు చేరింది. గత నాలుగు రోజులుగా ఆమె కేవలం మంచినీటిని మాత్రమే స్వీకరిస్తున్నారు. ఆమె ఆరోగ్యం బాగా క్షీణించినట్లు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు చెప్పారు. తక్షణమే దీక్షను విరమించాలంటూ సూచించారు. శ్రీమతి విజయమ్మ మాత్రం దీక్ష కొనసాగుతుందని  స్పష్టం చేశారు. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రభుత్వ వైద్యులు దీక్షా శిబిరానికి వచ్చి ఆమె ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. రక్త పోటు, చక్కెర స్థాయి బాగా తగ్గిపోయాయని వారు నిర్థారించారు.  ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పెదవి విప్పటంలేదు. మరోవైపు కూర్చొనే ఓపిక లేకపోవడంతో శ్రీమతి విజయమ్మ కొన్నిసార్లు పడుకునే ఉంటున్నారు.
శిబిరానికి తరలివచ్చిన ప్రజలకు అభివాదం కూడా చేయలేకపోతున్నారు. శక్తిని కూడదీసుకుని కూర్చోవడాన్ని  చూసి అక్కడకొచ్చిన వారి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. శ్రీహతి విజయమ్మ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ ఉండటంతో శిబిరం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

Back to Top