పాలమూరు జిల్లాలో గురువారం షర్మిల పాదయాత్ర

హైదరాబాద్‌, 21 నవంబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 36వ రోజు గురువారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కర్నూలు - మహబూబ్‌నగర్‌ జిల్లాల సరిహద్దులో ఉన్న తుంగభద్ర వంతెన మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగడంతో పాలమూరులో ప్రవేశిస్తుంది.

గురువారం ఉదయం షర్మిల పాదయాత్ర కర్నూలులోని సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల నుండి ప్రారంభం అవుతుంది. కర్నూలు జిల్లాలోని మామిడాలపాడులో కొనసాగుతుందని పార్టీ పాదయాత్ర సమన్వయకర్త తలశిల రఘురామ్‌ బుధవారం ప్రకటించారు. తుంగభద్ర వంతెన నుంచి కొనసాగిన పాదయాత్ర మహబూబ్‌నగర్‌ జిల్లాలోకి గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రవేశిస్తుందన్నారు. అక్కడి నుండి ఆమె పుల్లూరు క్రాస్‌ చేరుకుంటారన్నారు. పుల్లూరు క్రాస్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలోఅభిమానులు, పార్టీ శ్రేణులు, జిల్లా ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం ఆమె కలుగొట్ల, పోతులపాడు క్రాస్‌రోడ్డు వద్దకు చేరతారని రఘురామ్‌ తెలిపారు. అక్కడి నుంచి కదలివెళ్ళి బొంకూరుకు ముందు షర్మిల గురువారం రాత్రికి బసచేస్తారని ఆయన వివరించారు.

కాగా, మరో ప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల గురువారంనాడు మొత్తం 15,3 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని రఘురామ్‌ తెలిపారు. షర్మిల గురువారంనాటి పాదయాత్రలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ కూడా పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
Back to Top