ఓటేసిన జగన్‌మోహన్‌రెడ్డి

చంచల్‌గూడ జైలులో ఉన్న కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణలకు ఓటేసేందుకు కోర్టు అనుమతివ్వడంతో పోలీసు అధికారులు వారిని ప్రత్యేక వాహనాల్లో అసెంబ్లీకి తీసుకువచ్చారు. మధ్యాహ్నం 12.12 నిమిషాలకు మోపిదేవి వెంకటరమణ వచ్చారు. అక్కడే ఉన్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు బాలినేని, శోభానాగిరెడ్డి, గురునాథరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదెవెంకటరెడ్డి తదితరులకు అభివాదం చేస్తూ లోపలకు వెళ్లారు.

మోపిదేవి వచ్చినప్పుడు కాంగ్రె స్ ఎమ్మెల్యేలెవరూ అక్కడ లేరు. లోపలకు వెళ్లాక మోపిదేవిని చూసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు కిందనే తన చాంబర్లో ఉన్న సీఎం కిరణ్‌కు ఈ సమాచారాన్ని అందించడానికి హడావుడిగా పరుగెత్తారు. మోపిదేవి వచ్చిన విషయం తెలుసుకొని.. సీఎం చాంబర్లో ఉన్న బొత్స, మంత్రులు ఆనం, రఘువీరా, ఏరాసు, పితా ని, గంటా పలువురు ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చి ఆయనను పలకరించారు. తరువాత మోపిదేవితో పాటు బయటకు వచ్చి ఆయన పోలీసు వాహనం ఎక్కేవరకు (12.25 ని.) ఉండి వీడ్కోలు పలికారు.

సరిగ్గా 12.20 నిమిషాలకు వైఎస్ జగన్ అసెంబ్లీ లోపలకు చేరుకున్నారు. ఆయన వాహనం అసెంబ్లీకి కొద్దిదూరంలో ఉందన్న సమాచారం రాగానే అసెంబ్లీ బయటా, లోపలా పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ ద్వారాల వద్దకు భారీగా పోలీసులు చేరుకుని.. ఎవరూ రాకుండా కట్టుదిట్టం చేశారు. జగన్ వాహనం లోపలకు రాగానే వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు జై జగన్, జోహార్ వైఎస్సార్ అన్న నినాదాలతో హోరెత్తించారు. జగన్ ఓటు వేసి వెళ్లిన సందర్భంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Back to Top