నారాయణ.. బాబు బినామీ

ఏపీ అసెంబ్లీ: మంత్రి నారాయణ..ముఖ్యమంత్రి చంద్రబాబు బినామీ అని పుకార్లు ఉన్నట్లు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఆవరణలో వైయస్‌ జగన్‌ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. పదో తరగతికి సంబంధించిన తెలుగు, హిందీ, సైన్స్‌ పేపర్లు లీకైనట్లు తెలుస్తోందన్నారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకొస్తాయని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని నారాయణను చంద్రబాబు ఎందుకు మంత్రిని చేశారో అర్థం కావడం లేదని, నారాయణ..చంద్రబాబు బినామీ అని బయట పుకార్లు ఉన్నాయని వైయస్‌ జగన్‌ తెలిపారు. మంత్రులు నారాయణ, గంటా వియ్యంకులు కావడంతో  వారికి సంబంధించిన అంశం కాబట్టే ప్రభుత్వం దాటవేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. లీక్‌పై ఇప్పుడు చర్చించరట. 30న ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ తీరు ఇల్లు పూర్తిగా కాలాక..ఫైరింజన్లు పంపుతామన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. మంత్రి నారాయణ కారణంగా విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందని మండిపడ్డారు. నారాయణకు 1 నుంచి 100 ర్యాంకులు వచ్చాక..సీఎం స్పందిస్తారా? అని నిలదీశారు. నారాయణ విద్యా సంస్థల యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోర ని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. మేం ఏ విషయాన్ని ప్రస్తావించినా చర్చకు అనుమతించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మేం ప్రశ్నా పత్రాల లీక్‌ గురించి ప్రశ్నిస్తే దాన్ని పక్కనపెట్టి ల్యాండ్‌ బిల్లును ఆమోదించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని విమర్శించారు. పుష్కరాల్లో తొక్కిసలాటపై వేసిన విచారణకు అతీగతీ లేదని ధ్వజమెత్తారు. ఏ విషయంపైనైనా ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంభిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం అన్ని ఆధారాలు చూపితే స్పందించడం లేదని, ఈ రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని వైయస్‌ జగన్‌ అభిప్రాయపడ్డాడు.

Back to Top