బ్రిజేష్‌ తీర్పులో మొదటి ముద్దాయి టీడీపీయే

కడప (వైయస్ఆర్‌ జిల్లా) :

మిగులు జలాలపై ఆధారపడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యున‌ల్ నీటి‌ని కేటాయించకపోవడానికి ప్రధాన కారణం టీడీపీయే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ఆరోపించారు. 2004 కన్నా ముందు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పుడే ప్రాజెక్టులు నిర్మించి ఉంటే ఇప్పుడు ట్రిబ్యున‌ల్‌లో నీటి కేటాయింపులు జరిగేవన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆపలేకపోయిందని విమర్శించారు. ఇప్పుడు ఆ రాష్ట్రాలు నిర్మించిన ఆల్మట్టి సహా 12 అక్రమ ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరిపి వాటిని రెగ్యులరై‌జ్ చేసిందని మైసూరారెడ్డి పేర్కొన్నారు. కడపలోని వై‌యస్ గె‌స్టుహౌస్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదే‌శ్‌కు గొడ్డలి పెట్టు అని, ముఖ్యంగా రాయలసీమ, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు శాశ్వతంగా అన్యాయం జరుగుతుందని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులకే నీటి కేటాయింపులు జరిపారని, దాంతో మన ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులపై ఇప్పటివరకు ఖర్చు పెట్టిన రూ.40 వేల కోట్లు నిరర్థకమయ్యాయన్నారు. మధ్యంతర తీర్పు అనంతరం ట్రిబ్యున‌ల్ పక్షపాత వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన ‌టీడీపీ కూడా తమ తప్పులు కప్పిపుచ్చుకుంటూ ఇతరులపై బురద జల్లుతోందని మండిపడ్డారు.

టీడీపీ తొమ్మిదేళ్ల పాలనలో గాలేరు-నగరికి రూ.17 కోట్లు, హంద్రీ-నీవాకు రూ.13 కోట్లు, వెలిగొండకు రూ. 13 కోట్లు, కల్వకుర్తికి రూ.12 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, నెట్టెంపాడుకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని మైసూరారెడ్డి అన్నారు. కానీ,‌ మహానేత వైయస్ఆర్ హయాంలో 2004 నుంచి 2009 వరకు గాలేరు-నగరికి రూ. 4 వేల కోట్లు, హంద్రీ-నీవాకు రూ.4 వేల కోట్లు, వెలిగొండకు రూ. 1443 కోట్లు, నెట్టెంపాడుకు రూ. 1124 కోట్లు, కల్వకుర్తికి రూ. 1930 కోట్లు ఖర్చు చేశారని వివరించారు.

గాలేరు-నగరి ప్రాజెక్టు గ్రావిటీ ప్రకారం ప్రవహించే ప్రాజెక్టు అని, 1994లో ఆ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి పనులు అప్పగించినా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసిందని మైసూరారెడ్డి గుర్తుచేశారు. ట్రిబ్యునల్ తీర్పుపై ప్రభుత్వమే సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి ఉందని, లేనిపక్షంలో రాష్ట్ర ప్రాజెక్టులు స్మారక చిహ్నాలుగా మిగిలిపోతాయన్నారు.

‌ఈ సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురే‌శ్‌బాబు, డీసీసీబీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపా‌ల్‌రెడ్డి, కడప సమన్వయకర్త అంజాద్‌బాషా, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, హఫీజుల్లా పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top