వైయ‌స్ఆర్‌సీపీశ్రేణుల దిగ్భ్రాంతి


హైద‌రాబాద్‌: తమ అభిమాన నేత వైయ‌స్ జగన్‌పై హత్యాయత్నం జరగడంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని విశాఖ ఎయిర్‌పోర్ట్‌ ముందు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తి ఎలా వెళ్లిందని, తనిఖీ చేయకుండా ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది దుండగుడిని ఎలా లోపలికి పంపించారని వారు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన దుండగుడు అక్కడి రెస్టారెంట్‌లో పనిచేస్తుండగా.. ఆ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్దన్‌ అని, అతను గతంలో గాజువాక నుంచి టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నించారని తెలుస్తోంది.

వైయ‌స్‌ జగన్‌పై దాడి అమానుషం: పవన్‌ కల్యాణ్ 
అమరావతి : వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం అత్యంత అమానుషమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రతిపక్ష నేతపై జరిగిన దాడిని జనసేన తీవ్రమైనదిగా భావిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగరాదని జనసేన బలంగా కోరుకుంటుందని ఆయన తెలిపారు. ఈ హత్యాయత్నాన్ని ప్రజస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని పవన్‌ పిలుపునిచ్చారు. 

కేటీఆర్ ఖండ‌న‌
 ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో స్పందించారు. ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయ‌స్‌ జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. వైయ‌స్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇది పిరికిపందల చర్య: ఓవైసీ : ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ
హైదరాబాద్‌: వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ చెప్పారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..ఇది పిరికిపందల చర్యగా అభివర్ణించారు. వైఎస్‌ జగన్‌పై దాడి పూర్తిగా భద్రతా వైఫల్యమేనని పేర్కొన్నారు. విమానయాన శాఖా మంత్రి సురేష్‌ ప్రభు దీనిపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఒక మనిషి కత్తితో ఎయిర్‌పోర్టు లోపలికి ఎలా వెళ్లగలిగాడని అనుమానం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కూడా వీఐపీలకు భద్రత లేకుంటే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

జానారెడ్డి పరామర్శ
హైదరాబాద్‌ సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్‌ జగన్‌ను తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కె. జానారెడ్డి పరామర్శించారు. జగన్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఖండించిన నాయకులు
వైఎస్‌ జగన్‌పై దాడి జరగడాన్ని పలు పార్టీల నాయకులు ఖండించారు. ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ దాడిని గర్హించారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరగడాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత కూడా ఖండించారు. వైఎస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తాజా వీడియోలు

Back to Top