<br/><br/>కర్నూలు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలేసిన భిక్ష కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి అని పార్టీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ..వైయస్ఆర్సీపీ విసిరేసిన ఎమ్మెల్సీ పదవి కోసం కేఈ కుటుంబం దిగజారి వ్యవహరిస్తోందని విమర్శించారు. బీసీలంటే కేఈ కుటుంబం మాత్రమే అన్నట్టు ఇతర బీసీలకు అన్యాయం చేస్తోన్నారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు ఏ పదవి అయినా ఆ కుటుంభం తర్వాతే అన్నట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం ప్రాణాలను, ఆస్తులను ఫణంగా పెట్టిన బీసీలకు కేఈ కృష్ణమూర్తి చేసింది ఏమిటని ప్రశ్నించారు. <br/><strong> బీసీలంటే కేఈ సోదరులేనా...?</strong>కర్నూలు జిల్లాలో బీసీలంటే కేఈ సోదరులేనా అని బీవై రామయ్య ప్రశ్నించారు. ఏ అర్హతతో కేఈ ప్రభాకర్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారని ఆయన ప్రశ్నించారు. జిల్లాలోని టీడీపీకి చెందిన బీసీలు అందరూ అసంతృప్తితో ఉన్నారని, టీడీపీ వెంట ఉన్న నాగేశ్వర యాదవ్, బట్టిన వెంకటరాముడు, బొజ్జమ్మ, గుడిసె కృష్ణమ్మ, తుగ్గలి నాగేంద్ర, బీటీ నాయుడు అర్హులు కారా? నాయి బ్రాహ్మణ, రజక ఇతర కులాల్లో అర్హులైన బీసీలే లేరా..? అని సూటిగా అడిగారు. పదవుల పందేరంలో ముందు వరుసలో ఎప్పుడూ కేఈ కుటుంబం ఉండటం సిగ్గు చేటన్నారు. పదవుల కోసం పార్టీని నమ్ముకున్న వారిపై బెదిరింపులకు దిగడం కేఈ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని, ఇప్పటికైనా జిల్లాలోని బీసీ నాయకులందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.<br/><strong>ఉప ముఖ్యమంత్రి స్థాయిలో బెదిరింపులు</strong>కేఈ కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమని బీవై రామయ్య అన్నారు. కళ్ల ముందే ప్రజా స్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నా డెప్యూటీ సీఎం ధృతరాష్ట్రుడిలా మారాడని విమర్శించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న కేఈ కృష్ణమూర్తి లాంటి వారు కూడా అహంకార పూరిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. తన తమ్ముడు నామినేషన్ వేసి గంటలు గడవకముందే ఎన్నిక ఏకపక్షమే, స్వతంత్ర అభ్యర్ధులు పోటీ నుంచి తప్పుకుంటారు.. అంటూ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో బెదిరింపు ధోరణి లో మాట్లాడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. వైయస్ఆర్సీపీ పోటీలో ఉన్నా అత్యధిక మెజార్టీతో గెలిచేవాళ్లం అంటున్నారు..అది ఎలాగో ఆయనే చెప్పాలని అన్నారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వారిని బెదిరించే ధోరణిలో ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉండటం దురదృష్టకరమన్నారు