హైదరాబాద్: తెలంగాణలో అమలులో ఉన్న రూ.5 భోజన పథకాన్ని మంగళగిరిలో సొంత నిధులతో ప్రవేశపెడుతున్నట్టు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హరే కృష్ణ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న భోజన కేంద్రాన్ని ఆర్కే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మండే ఎండలో క్యూ లైన్లో నిల్చుని భోజనం సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే బోజనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో ఈ కార్యక్రమం బాగుందని, తన నియోజక వర్గం మంగళగిరిలో ఇలాంటి కార్యక్రమం పెట్టి సొంతంగా పేదలకు భోజనం పెట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. అందుకోసం క్షేత్ర స్థాయిలో రూ. 5 భోజన పథకాన్ని స్వయంగా పరిశీలిస్తున్నట్టు ఆర్కే తెలిపారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలా రోడ్డుపై లైన్లో నిలబడి మరీ భోజనం చేయడం స్థానికులను ఆశ్చర్యపరిచింది.