విజయవాడ: ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు సిగ్గు, శరం ఉంటే మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కండ్రికలోని 59వ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళా కార్పొరేటర్పై ప్రతాపం చూపడం సరికాదన్నారు. ఇళ్ల జాబితా అడిగితే ఇవ్వకపోగా, వేలు చూపి ఏకవచనంతో సంబోధిస్తూ దుర్భాషలాడడం ఎమ్మెల్యే స్థాయికి తగదని హితవు పలికారు. ఇళ్ల కేటాయింపుల్లో అవినీతిని ప్రశ్నిస్తే దూషించడం ఏ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వకుండా డివిజన్ ప్రజలపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తొలుత డివిజన్లోని మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. 59 డివిజన్ కార్పొరేటర్ అవుతు శ్రీశైలజ మాట్లాడుతూ ‘ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి, నా దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేయిండని ఎమ్మెల్యే ఉమాను కోరగా ఆయన ‘నీవు ఎంక్వైరీ చేస్తావా? ఏంటి సొల్లు మాట్లాడుతున్నావ్’ అంటూ ఏకవచనంతో సంబోధించారని తెలిపారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి స్పందించాల్సిన తీరు ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.