<strong>హైదరాబాద్ :</strong> జనం గుండెల్లో చిరస్థానం పొందిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పేరు వింటేనే ఇప్పటి కాంగ్రెస్, టిడిపి నేతల గుండెల్లో వణుకు ఎందుకని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. అధికారం పోతుందని కాంగ్రెస్, అధికారం రాదని టిడిపి భయపడుతున్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని కరుణాకరరెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి అమ్ముడుపోయిందని ధ్వజమెత్తారు. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. శాసనసభలో ఇది ఆయన తొలి ప్రసంగం.<br/>‘మంచి పనులు చేసిన వారు కీర్తి కిరీటాలతో ప్రజల మధ్య జీవించి ఉంటారు. మంచి పనులు చేయకపోతే ఎంతకాలం రాజ్య పాలన చేసినా చరిత్రలో కలిసిపోతారు’ అనే అర్థంతో పోతన చెప్పిన పద్యంతో భూమన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘పోతన చెప్పిన విధంగా ఎన్నో మంచి పనులు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల్లో జీవించి ఉన్నారు. మూడున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించడంలో విఫలమైంది. ఫలితంగా ప్రజల తిరస్కారానికి గురైంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను ప్రజలు మట్టికరిపించారు’ అన్నారు.<br/><strong>వైయస్ హామీలకు తూట్లు పొడిచిన ప్రభుత్వం :</strong>పథకాలకు మంచి మంచి పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలకు ఒరిగిందేమీ లేదని భూమన అన్నారు. మహానేత వైయస్ పథకాలకు తూట్లు పొడిచి ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు. వైయస్ పథకాలను నీరుగార్చిన ఘనత కిరణ్ ప్రభుత్వానికే దక్కుతుందని దుమ్మెత్తిపోశారు. ‘రైతులకు ఉచిత విద్యుత్ను 9 గంటలకు పెంచుతామని 2009లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున ప్రజలకు మహానేత వైయస్ ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రభుత్వం మరిచింది. అంతేగాక మూడున్నరేళ్లలో ప్రజలపై ఏకంగా రూ. 32 వేల కోట్ల విద్యుత్ భారం వేసింది. రైతులకు రెండు గంటలు కూడా కరెంటు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వైద్యం అందక ఏటా 3 వేల మంది చిన్నపిల్లలు చనిపోతున్నారు. వీటన్నింటినీ ప్రభుత్వం చేస్తున్న హత్యలుగానే భావించాలి. మహానేత వైయస్ హామీలను, ఆయన పథకాలను సంతృప్తస్థాయిలో అమలు చేయగల సత్తా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డికే ఉందని ప్రజలు విశ్వసించారు. అందుకే ఉప ఎన్నికల్లో వైయస్ఆర్పికి బ్రహ్మరథం పట్టారు’ అని వివరించారు.<br/><strong>సహకార ఎన్నికల్లో అక్రమ విజయం.. సిగ్గుచేటు :</strong>సహకార ఎన్నికల్లో లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడి, పెద్ద సంఖ్యలో సంఘాల ఎన్నికలు వాయిదా వేసి, గెలిచామని అధికార కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటని భూమన అన్నారు. ఇంతలో మంత్రి కొండ్రు మురళి జోక్యం చేసుకున్నారు. ఆరోగ్యశ్రీతో సహా అన్ని పథకాలనూ గతంలో కంటే మెరుగ్గా అమలు చేస్తున్నామన్నారు. వైయస్ ఫొటో పెట్టుకొంటే ప్రయోజనమేమీ ఉండదని వైయస్ఆర్సిపిని ఉద్దేశించి అన్నారు. మంత్రి కొండ్రు మురళి వ్యాఖ్యలను భూమన తిప్పికొట్టారు. తాము మహానేత వైయస్ ఫొటో పెట్టుకుని, ఆయన పేరు చెప్పుకునే ప్రజల్లోకి వెళ్లామని భూమన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన ఫొటోతోనే వెళ్లి కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.<br/><strong>అమ్ముడుపోయిన టిడిపి :</strong>ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడంలో ప్రభుత్వం విఫలమైతే, ప్రభుత్వం తీరును ఎండగట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి బేరసారాలు ఆడుకొని అమ్ముడుపోయిందని భూమన విమర్శించారు. వైయస్పై, ఆయన కుటుంబంపై టిడిపి సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు దుర్మార్గమైన, అరాచకమైన విమర్శలు చేశారంటూ ధ్వజమెత్తారు. రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, తన నిర్ణయాల ద్వారా 3 వేల కిలోమీటర్లు వెనక్కు పోయారంటూ శాసనమండలిలో విపక్ష నేత, టిడిపి సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు చేసిన విమర్శలను ఆయన ప్రస్తావించారు. బాబు అవినీతి పాలన గురించి మాట్లాడితే రోజులు, వారాలు కూడా చాలవన్నారు.