<span style="text-align:justify">కర్నూలు: ప్రజల ఇబ్బందులు తొలగిపోవాలంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందేనని, వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేద్దామని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మీ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్లీనరీ నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు ఎర్రబోతుల వెంకటరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువొస్తుందన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని, అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. ఒకే సారి రైతులకు రుణమాఫీ చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రుణాలు మాఫీ కాక..అప్పులు తీర్చలేక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. <br/></span>