కుట్రలను ఛేదించే శరం షర్మిల: చేగొండి

పాలకొల్లు:

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలపైనా.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వైయస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఎక్కుపెట్టిన బాణమే షర్మిలని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ హరిరామజోగయ్య వ్యాఖ్యానించారు. జగన్ పొదిలో చాలా అస్త్రాలున్నాయనీ.. ఇకపై కాంగ్రెస్, టీడీపీల కుట్రలు చెల్లవనీ పేర్కొన్నారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో నూటికి నూరుపాళ్లు నీతిమంతులెవరో చెప్పగలిగే దమ్ము పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఉందా? అని సవాల్ చేశారు. జగన్ తన సోదరి షర్మిలను ఎవరిపై ఎక్కుపెట్టిన బాణమంటూ బొత్స విమర్శించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం మిన్నకుండిపోయిందని, అధికార-ప్రతిపక్షాలు ఏకమై ప్రజలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు.

Back to Top