జగన్‌లో అదే నిబ్బరం.. అదే ధైర్యం: మేకపాటి

హైదరాబాద్, 5 జూన్‌ 2013: జైలులో నిర్బంధించి ఏడాది గడిచినా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు,‌ కడప ఎం.పి. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అదే ధైర్యం, అదే నిబ్బరంతో ఉన్నారని నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మంచి లక్షణం ఇదే అన్నారు. ‌చంచల్‌గూడ జైలులో ఉన్న శ్రీ జగన్ ను‌ బుధవారంనాడు ఆయన కలిశారు.

అనంతరం రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సెప్టెంబర్లో‌ శ్రీ జగన్‌ కచ్చితంగా బయటకు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బయటకు వచ్చి, రాష్ట్రానికి నాయకత్వం కూడా వహిస్తారని ఆయన చెప్పారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి తప్పకుండా న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందన్నారు.

డి‌.ఎల్. రవీంద్రారెడ్డి బర్తరఫ్, ఇతర సమస్యలతో కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా ఉందన్నారు. ప్రతిపక్షం పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదని తెలిపారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు తామంతా కృషిచేస్తామని మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు.
Back to Top