నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నం

  • డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే మూట కట్టారు
  • రెండో డ్రైవర్‌ ఏమయ్యాడో అంతు చిక్కడం లేదు
  • మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి
  • డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు
  • నందిగామ ఆసుపత్రి వద్ద వైయస్‌ జగన్‌ను అడ్డుకున్న పోలీసులు, టీడీపీ నేతలు
  • మృతుల కుటుంబాలకు వైయస్‌ జగన్‌ పరామర్శ

నందిగామ: కృష్టా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిందితులను కాపాడేందుకు తెలుగు దేశం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఇంతకన్న దారుణం ఏదైనా ఉందా అని ఆయన ధ్వజమెత్తారు. ప్రతి ఏటా కేశినేని, దివాకర్‌ ట్రావెల్స్‌ ప్రమాదాలకు గురవుతున్నాయని, వీరికి ఎలాంటి నిబంధనలు వర్తించడం లేదని, ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతూ అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని పోలీసులు,  టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. నిందితులను కాపాడేందుకు డాక్టర్లు మృతదేహాలకు పోర్టుమార్టం నిర్వహించకుండా మూటకట్టడాన్ని వైయస్‌ జగన్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఎవరిని కాపాడేందుకు ఇలాంటి చర్యలు చేపట్టారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే.. 

రోడ్డు ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ మృతదేహాలకు డాక్టర్లు రెండు గంటల్లో పోస్టుమార్టం చేసినట్లు మూట కట్టారు. డ్రైవర్‌ మద్యం సేవించి బస్సు నడిపారా? లేదా అన్నది తెలియాలంటే శవానికి పోర్టు మార్టం చేయాలి. కనీసం డ్రైవర్‌ మద్యం సేవించారా అని అడిగితే డాక్టర్‌ పోస్టుమార్టం చేయలేదని సమాధానం చెప్పారు. పోస్టుమార్టం చేస్తే డ్రైవర్‌ తాగాడా? లేడా అన్నది తెలుస్తుంది. కనీసం రెండో డ్రైవర్‌ ఏమయ్యాడు, ఎక్కడున్నారని కలెక్టర్‌ను అడిగితే ఆయన లేడు..వెళ్లిపోయాడని కలెక్టర్‌ చెబుతున్నారు. రెండో డ్రైవర్‌కు లైసెన్స్‌ ఉందా? లేదా?,  అయన కూడా తాగి ఉన్నారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.. ఆ డ్రైవర్‌ను ఎందుకు పంపించారో సమాధానం చెప్పాలి. సర్కార్‌ ఒక పద్ధతి ప్రకారం బస్సు యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఒక సంవత్సరం కేశినేని, మరో సంవత్సరం దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ బస్సుల యాజమాన్యాలు టీడీపీ నేతలు కావడంతో ఒకే బస్సు పర్మిట్‌తో మూడు,నాలుగు రూట్లతో తిప్పుతున్నారు.  వాళ్లకు రూల్స్‌ ఏమీ పట్టవు . కాంట్రాక్ట్‌ క్యారియర్లను స్టేజీ క్యారియర్లుగా తిప్పుతున్నారు. అంతా వారిష్టం. ఆపకూడని చోట కూడా ఆపుతున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసినా పట్టించుకోవడం లేదు. 

ఘటన స్థలంలో చూస్తే ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించే వీలు లేదు. ఈ బస్సు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఉంటుంది. గాల్లో ప్రయాణం చేసి కల్వర్టును ఢీకొట్టింది. అందుకే ఇంతమంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారికి కనీసం పోస్టు మార్టం చేయకుండానే శవాన్ని మూటకట్టారు. రెండో డ్రైవర్‌ కనిపించడం లేదు. ఇంతదారుణంగా దగ్గరుండి రూల్స్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒక్కో వ్యక్తికి రూ. 2 లక్షలు, 5 లక్షలు పరిహారం అంటున్నారు. బస్సు యాజమాన్యం ఎంత ఇస్తుంది?  కనీసం రూ.20 లక్షలు పరిహారం ఇప్పిస్తేనే ఇలాంటి ప్రమాదాలు ఆగుతాయి. బస్సు యాజమాన్యాలను ఈవిధంగా రక్షిస్తే..రేపు మీ పిల్లలు, మా పిల్లలు కూడా ఇదే బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇలాంటి చర్యలకు ఫుల్‌స్టాప్‌ పెట్టండి. ఇవాళ వాళ్లకు జరిగింది. రేపు మన కుటుంబాలకు జరిగే అవకాశం ఉంది. నిజాలను వెలికితీయండి, చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇప్పించే ప్రయత్నం చేయండి. అలాగైనా బాధిత కుటుంబాలకు తోడుగా నిలబడదాం. ఇందుకు పోలీసులు, మీడియా మానవత్వంతో వ్యవహరించాలని వైయస్ జగన్ సూచించారు. 
Back to Top