మీ తప్పులకు ఇతరులను బాధ్యలను చేయవద్దు బాబూ!

న్యూఢిల్లీ: కేంద్రంలోని
బిజెపి ప్రభుత్వ మెడలు వంచే క్రమంలో భాగంగానే ఢిల్లీలో వంచన పై గర్జన దీక్షను
నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపి మిథున్ రెడ్డి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక
హోదా అంశాన్ని భుజాన వేసుకోక పోయి ఉంటే చంద్రబాబు ఆ మాట ఎత్తేవారు కాదన్నారు.
నాలుగున్నరేళ్లపాటు ప్యాకేజి కావాలంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తునప్పుడు కూడా
ప్రజలను చైతన్యవంతులను చేశామన్నారు. హోదా వల్ల కలిగే ప్రయోజనాలను రాష్ట్ర మంతటా
తిరిగుతూ ప్రజలకు  వైయస్ జగన్  వివరించారనీ, ప్రాణాలను అడ్డం పెట్టి మరీ
నిరాహార దీక్షలు చేశారన్నారు. మరోవైపు బిజెపి, టిడిపి లు ఒకరినొకరిని పొగుడుకుంటూ
ప్రజలను మోసం చేశారన్నారు.

చంద్రబాబు గారు మీరు
చేసిన తప్పులకు ఇతరులను బాధ్యులను చేయవద్దన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి
కాకున్నా, రోజుకో కార్యక్రమం పేరుతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని, కేంద్ర
ప్రభుత్వం చేయాల్సిన పనులను మీ భుజాన ఎందుకు వేసుకున్నారో చెప్పాలన్నారు. స్టీల్
ఫ్యాక్టరీ విషయం కూడా నాలుగున్నరేళ్లు కాలక్షేపం చేసి, ఈ రోజు శంకుస్థాపన చేయడంలో
అర్థం లేదన్నారు. ఈ ఫ్యాక్టరీని నిర్మించాల్సిన కేంద్రం చేతులెత్తేస్తే, ఈ రోజు
మేమేదో చేస్తామంటూ రాష్ట్రం ప్రజలను మోసం చేస్తోందన్నారు. ప్రభుత్వ ధనంతో కేంద్రంపై
పోరాటాలు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఏం చేస్తారో
చెప్పకుండా, విమర్శలు చేయడం తగదంటూ ఇటీవల వైయస్ జగన్ పై విమర్శలు చేసిన ఎంపి జెసి
దివాకర్ రెడ్డికి సూచించారు. ప్రత్యేక హోదా అనేది జగన్ నేతృత్వంలోనే సాధ్యమని, మాట
తప్పకుండా పోరాడుతున్న ఆయనవల్లే హోదా వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.  

Back to Top