కావలిః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. గత ఏడురోజులుగా వర్షాలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయని, ఇళ్లన్నీ మునిగిపోయి తిండితిప్పలు లేక ప్రజలు బాధపడుతుంటే..అధికారులు గానీ, అధికార పార్టీ నేతలు గానీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి సీఎంలా కాకుండా టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు సీఎంలాగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలున్న ప్రాంతాల్లో ప్రజలకు ఏమీ ఇవ్వవద్దంటూ చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. <br/>నెల్లూరు జిల్లాలోని కావలిలోని వరద ప్రాంతాల్లో ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు. కుండపోత వర్షాలతో ఇళ్లన్నీ దెబ్బతిని ప్రజలు తలదాచుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఎమ్మెల్యే వాపోయారు. వరద తాకిడికి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగితే...నియోజకవర్గ సమస్యలపై సీఎం కనీసం మీటింగ్ కూడా పెట్టలేదని మండిపడ్డారు. చలిగాలికి ఇళ్లు లేక అనేక మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు కట్టించాలని అర్జీలు పెట్టుకున్నా గత ఐదు సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు తమ గోడును ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. తక్షణమే ప్రభుత్వం బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వానికి పుట్టగతులుండవని హెచ్చరించారు.