ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు

హైదరాబాద్ 05 జూలై 2013:

కాంగ్రెస్‌ పార్టీలో తమకు న్యాయం జరగదనే తాము వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరినాధ్ బాబు చెప్పారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో గౌరవాధ్యక్షురాలు శ్రీమతి  వైయస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఇరవై అయిదేళ్ళు  సేవ చేస్తే.... కాంగ్రెస్ మాత్రం తన అన్నను మోసం చేసిందని ఆరోపించారు. బీసీలమయినందునే తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ తీరుపై విసిగిపోయే ఆ పార్టీని వీడామన్నారు.

ఆరోగ్యం బాగోలేదన్నా తన సోదరుడిని కనికరించలేదని హరినాధ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సాయం కోసం మంత్రి కొండ్రు మురళిని బతిమాలినా పట్టించుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. మోపిదేవిని అప్రూవరుగా మారమని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి సూచించారని ఆయన వెల్లడించారు. తన సోదరుడు అప్రూవరుగా మారితే సాయం చేస్తామని పనబాక చెప్పారన్నారు. వైద్యం కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు కూడా పట్టుకున్నామని హరినాధ్ బాబు తెలిపారు. తాను నమ్ముకున్న నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డనీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం సంతోషంగా ఉందని హరినాధ్ బాబు అన్నారు.

Back to Top