హామీల ఎగవేతలో చంద్రబాబుకు సాటిలేరు

హైదరాబాద్,

సెప్టెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు తన అనుభవంతో ఎన్నికల హామీల నుంచి ఎలా తప్పించుకోవాలా అనిచూస్తున్నారని వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. చంద్రబాబు తన అనుభవంతో 87  వేల కోట్ల వ్యవసాయ రుణాలను 45 వేల కోట్లకు తగ్గించారని ఆయన ఎద్దేవా చేశారు. ఇక ఆర్థిక మంత్రి యనమల 45 వేల కోట్లను ఏకంగా 5 వేల కోట్లకు కుదించారని మండిపడ్డారు. బంగారంపై తీసుకున్న 43 వేల కోట్ల రుణాలను 21  వేల కోట్లకు తగ్గించిన ఘనత చంద్రబాబుదే అని పార్థసారథిఅన్నారు.

కోటయ్య కమిటీని నియమించి కాలయాపన చేసిన చంద్రబాబు ఇప్పుడు సుజనా చౌదరిని నియమించారు ఆయనేమో రుణమాఫీకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ డ్రామా ఆడుతున్నారన్నారు. ఈ రోజు రాష్ట్రంలోని అన్నిజలాశయాలు  నిండుగా ఉన్నా చంద్రబాబు నిర్వాకంవల్ల 30 శాతం విస్తీర్ణంలో కూడా  నాట్లు పడలేదని విమర్శించారు. సాగు నీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సొంత జిల్లాలోనే  40 శాతం విస్తీర్ణంలోసాగు జరిగిందన్నారు.

చంద్రబాబుది రోజుకో మాట..పూటకో కమిటీ అని పార్థసారథి విమర్శించారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా రుణ మాఫీకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ డ్రామా ఆడుతున్నారన్నారు. చంద్రబాబు హైటెక్‌ పోకడలు ఇంకా వదులుకోలేదని, ప్రతిరోజూ హైటెక్, కంప్యూటర్లు, స్మార్ట్‌సిటీలు అనే అంటున్నారని తెలిపారు. వాస్తవానికి ఇప్పుడు కావల్సింది స్మార్ట్‌సిటీలు కాదు, స్మార్ట్‌ విలేజీలని ఆయన అన్నారు.

Back to Top