<strong>హైదరాబాద్, 12 జనవరి 2013:</strong> వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ, ఆయనను విడుదల చేయాలంటూ పార్టీ చేపట్టిన 'జనం కోసం జనం సంతకం' కార్యక్రమానికి దేశ, విదేశాల్లోనూ విశేష స్పందన లభిస్తోంది. జగన్ కోసం చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో ఇంత వరకూ 2 కోట్లకు పైబడి ఉత్సాహంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో 30 వేల మంది ప్రవాస భారతీయులు కూడా పాలు పంచుకుని తమ సంతకాలు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్(యుఏఇ)లో ఈ సంతకాల కార్యక్రమం ముమ్మరంగా జరిగిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ శనివారం హైదరాబాద్లో వెల్లడించారు. అమెరికా, ఆస్ట్రేలియాలోని తెలుగువారు ఆన్లైన్లో పెద్ద సంఖ్యలో తమ సంతకాలు చేశారని ఆయన వివరించారు.<br/>వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం ప్రతినిధులు నరసారెడ్డి, సి.చంద్రశేఖర్ కువైట్లో, ఛాయాదేవి, సోమిరెడ్డి, బ్రహ్మానంద్ కువైట్ లో సంతకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారని ఆయన తెలిపారు. వారాంతపు సెలవుల్లో వీరంతా కలుసుకుని తెలుగువారు నివసించే ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి పత్రాలపై సంతకాలు చేయించారని వెంకట్ తెలిపారు. ఈ సంతకాల ప్రతులను ఎప్పటికపుడు స్కాన్ చేసి ఆన్లైన్ ద్వారా హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారని వెంకట్ వివరించారు.