పరి పాలన ఎలా వుందో తెలుసుకోవాలని మారువేషంలో చంద్రబాబు ఒక అర్థరాత్రి పర్యటనకి బయలుదేరాడు వెంట పిఏ వున్నాడు. ఒక చోట కొందరు పిల్లలు ఆరు బయట పడుకొన్నారు. తాజాగా ఒక స్కూల్ కు పాఠాలు చెప్పివచ్చిన చంద్రబాబు ఆనందంగా అక్కడకు వెళ్లాడు.“ఈ మధ్య కాలంలో పిల్లలకు ముఖ్యమంత్రి పాఠాలు చెప్పిన సంగతి మీకు తెలుసా” అని అడిగాడు. వెంటనే బాబుని ఆకాశానికి ఎత్తుతారన్న ఉద్దేశ్యంతో తానే కాస్త ఎత్తుగా నిలబడ్డాడు. “ఆ సంగతి మాకు తెలీదు, మేం బడులకు వెళ్లటం లేదు.” అని జవాబిచ్చారు. “ఎందుకు వెళ్లటం లేదు, ఈ ప్రభుత్వం బడిపిల్లలకు ఎన్నో చేస్తోంది” అని కంఠం సవరించుకోబోయాడు.“మేం బలహీన వర్గాల పిల్లలం. గతంలో మేం హాస్టల్ లో ఉండి స్కూల్ లో చదువుకొనేవాళ్లం. చంద్రబాబు 310 హాస్టల్స్ మూసేయటంతో మా మాదిరిగా వేల మంది చదువులు మానేశారు” అని బాబుని తిట్టడం మొదలెట్టారు. దీంతో బాబు ఊళ్లోకి పరిగెత్తాడు. ఒక చోట భార్యభర్తలు గొడవ పడుతున్నారు ఉన్న డబ్బులన్నీ తాగేశాడని భార్య అరుస్తూవుంది. ఆమె పై భర్త వీరంగం వేస్తున్నాడు. చంద్రబాబు కలగచేసుకుని `` చంద్రబాబు లాంటి గొప్పవ్యక్తి పాలనలో ఇలా తాగి తందనాలు ఆడుతావా ? `` అని భర్తను మందలించాడు. భర్త ఎగాదిగా చూసి `` తమరెవురు బాబయా `` అని అడిగాడు. `` ఆయనో బాటసారి `` అని పిఏ చెప్పాడు. ``నువ్వేమైనా ఆయన పిఏవా ? ఆయనకి నోరు లేదా ? `` `` నేనో బాటసారిని `` చెప్పాడు బాబు. `` నేనో బ్రాందిసారిని. మీరు రోడ్డుపైన నడుస్తారు. నేను మందుపై నడుస్తా. చంద్రబాబుని గొప్పవ్యక్తి అన్నారు. నిజమే ఆయన మాట మాకు వేదవాక్కు. ఆయన ఏమన్నాడు ? విదేశాల్లో భార్యభర్తలు కొట్లాడితే ఒక పెగ్గుతాగుతారు. అదే మన రాష్ట్రంలో అయితే ఫుల్లు తాగుతారు అన్నాడా లేదా ? ముఖ్యమంత్రే చెబితే వినాలా వద్దా ?అందుకే ఆయన మాటకి గౌరవమిచ్చి ఫుల్లుతాగేశా `` `` తాగడం మానేసి మొక్కలు నాట వచ్చుగా`` అన్నాడు బాబు `` ఏంటీ తాగడం మానేయాలా ?`` అంటూ తాగుబోతు ఒక కర్రని తీసుకుని పిచ్చి పిచ్చిగా నవ్వుతూ వెంటపడ్డాడు. చంద్రబాబు, పిఏ దూరంగా వెళ్లి నిలబడ్డారు. `` తాగడం మానేస్తే పిచ్చోళ్ళయిపోతారని మా చంద్రబాబే చెప్పాడు. పిచ్చోడిగా బతకడం కంటే తాగుబోతుగా జీవించడం మేలు కదా `` `` ఇంతకాలం జనం మీ మాటల్ని నమ్మరని అనుకున్నాను కానీ మీ మాటల్ని విశ్వసించే వర్గం కూడా వుందని అర్థమైంది సార్ `` అన్నాడు పిఏ `` తాగుబోతులు మాటపైన నిలబడరని అంటారు. కానీ వీడు నా మాటమీద నిలబడడం గర్వంగా వుంది`` అన్నాడు బాబు `` అయినా వాళ్లెంత తాగితే మనకంత ఆదాయం. వాళ్ళ జోలికెందుకు వెళతారు మీరు .`` ఆ తరువాత డ్వాక్రా మహిళా సంఘం దగ్గరికెళ్ళారు. `` చంద్రబాబు రుణమాఫీ వల్ల మీకు బాగా లాభం కలిగిందా ? `` అని పిఏ అడిగాడు. `` లాభం గూబల్లోకి వచ్చింది. ఆయన్ని నమ్మడం వల్ల పుస్తెలు అమ్ముకుని పస్తులుంటున్నాం `` అని చెప్పిందో మహిళ`` బాబంటే ఎవరకున్నావు. మాట తప్పేవాడు కాదు `` అన్నాడు చంద్రబాబు `` మీది పరాయిదేశమా బాబూ ?`` `` కాదు, ఈ రాష్ట్రమే `` `` బాబు మాటమీద నిలబడతాడని నమ్ముతున్నాడంటే నీది కచ్చితంగా ఈ రాష్ట్రం కాదు. ఎందుకంటే చంద్రబాబు ఏది చెప్పినా చేయడు `` ``సార్, ఇక్కడ కూడా కథ అడ్డం తిరుగుతూ వుంది. వెలదామా? ``అన్నాడు పిఏ ఈ సారి ఒక రైతు దగ్గరికి వెళ్ళారు `` చంద్రబాబు హయాం ఎలా వుంది ? `` అడిగాడు పిఏ `` గతంలో ఎట్లావుందో, ఈ సారి కూడా అట్లానే వుంది `` చెప్పాడు రైతు `` రుణమాఫీ జరిగిందా ?`` `` మాఫీ కాదు, ఓట్లేసిన వారికి తగిన శాస్తి జరిగింది `` `` మీ అబ్బాయికి జాబొచ్చిందా?`` `` మా వూళ్ళో టిడిపి నాయకులకి జీపులొచ్చాయి``రైతు ఒక కర్ర తీసుకున్నాడు. `` ఆయనెవరో తెలుసా ?`` అని అడిగాడు పిఏ `` తెలుసు, చంద్రబాబు `` `` మారువేషంలో వున్న ఎలా గుర్తు పట్టావ్ `` `` ఎవరి దగ్గరైనా వేషాలు వేయవచ్చు కానీ, రైతులు మాత్రం చంద్రబాబుని కచ్చితంగా గుర్తుపడతారు `` అని కర్రతో తరుముకున్నాడు.దీంతో చంద్రబాబు, పీఏ పరిగెత్తుకొంటూ ఎప్పటిలాగే బస్సు ఎక్కి బజ్జున్నారు.