అభివృద్ధిలో దూసుకుపోతున్న మద్యాంధ్రప్రదేశ్

 అందరూ ఆడిపోసుకుంటున్నారు
గానీ మన ముఖ్యమంత్రి చెబుతున్న బహుముఖాభివృద్ధిలో ఇది మాత్రం లేదేమిటీ!! అత్యద్భుత
మద్యం విధానాల ద్వారా, బీరును హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేసిన
కారణంగా, బెల్టు షాపులను మహత్తరంగా నడిపిస్తున్న పుణ్యాన రాష్ట్రంలో
మద్యం అమ్మకాల్లో అభివృద్ధి జెర్రి గొడ్డంత స్పీడుగా పోతోందిట. ఎక్కడైతే ఏం అభివృద్ధి సూచి అమాంతం పైకెళ్లడం కావాలిగానీ, ప్రమాదాల్లో, నేరాల్లో, మహిళలపై
అఘాయిత్యాల్లో, భూకబ్జాల్లో, మద్యం అమ్మకాల్లో
ఇలా ప్రతి అంశంలోనూ ఆంధ్రప్రదేశ్ అమిత వేగంతో ముందుకు పోతోంది. దాన్నలా ముందుకు తీసుకుపోతున్న ఘనత అక్షరాలా మన అమరావతీధీశ చంద్రబాబుగారిదే.

 ఏటికేడాది సాగు విస్తీర్ణం
తగ్గిపోవచ్చుగాక,
గొలుసు మద్యం దుకాణాలు బారులు తీరుతున్నాయిగా! పంటలకు మద్దతు ధర పెరగకపోతే ఏమిటి నష్టం, ఆ గుబులు,
దిగులు తీర్చే బాటిళ్ల ఖరీదు పెరుగుతూనే ఉందిగా! ఉద్యోగాల కల్పనలో వృద్ధి శాతం స్వల్పంగానే ఉందని బాధేల, లిక్కర్ 9.38, బీరు 14.64 శాతం
వృద్ధిని నమోదు చేసాయి చంకలు గుద్దుకోండి. లిక్కర్ ను బీట్ చేస్తూ
బీరు ముందుకు పోవడాన్ని గురించి మద్యాసురులు తెగ ఆనంద పడుతున్నారట. బీరుకు హెల్త్ డ్రింక్ హోదా కల్పించి, బేకరీల్లో సైతం
దొరకాలని సూచించిన ప్రభుత్వ పెద్దలకు వారు వెయ్యి బీరు బాటిళ్లతో అభిషేకం చేయాలని కూడా
ప్లాన్ చేస్తున్నారట.

 మరే రంగంలోనూ లేనివిధంగా
మద్యం అమ్మకాల్లో రాష్ట్రం మాంచి జోరుమీదుందని సర్వేలు చెబుతున్నాయి. ఎక్సైజ్
శాఖ అధికారులు మద్యం షాపులకు టార్గెట్లు పెట్టి మరీ అమ్మకాలు చేయించే రోజులు చెల్లిపోయాయి.
షాపులకు టార్గెట్లు లేవు. అయితేనేం అమ్మకాలు మాత్రం
ఊపందుకున్నాయి. బలవంతం మీద కన్నా టార్గెట్ లెస్ విధానంలోనే మద్యం
అమ్మకాలు మహా స్పీడుగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.  బెల్టుషాపులపై, ఇళ్ల మధ్య మద్యం దుకాణాలపై మహిళలు విరుచుపడి, వాటిని
ధ్వంసం చేసి ఆవేశం, ఆయాసం తెచ్చుకున్నారు కానీ, రావణుడి తలల్లా ఒకటి కూలిస్తే రెండు మద్యం షాపులు మొలుస్తూనే ఉన్నాయి.
చంద్రబాబు గారి సారధ్యంలో, ఎపి మద్యం విధానంతో,
సిండికేట్ల లాలూచీలతో రాష్ట్ర మద్యం అమ్మకాల అభివృద్ధి అలా అలా ఆకాశాన్ని
తాకుతుండటాన్ని సెలబ్రేట్ చేసుకునే పనిలో ఉన్నాయి ప్రభుత్వ వర్గాలు. 

Back to Top