వైయస్ఆర్ జిల్లా: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో విధ్వంసం జరుగుతుందని, ఆధ్యాత్మిక స్థలాలను కూల్చివేస్తుంటే సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పిఠాపురం పీఠాధిపతి ఎక్కడికి వెళ్ళాడని వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సొంత శాఖ అధికారులు కూల్చివేతకు దిగితే ఎందుకు నోరుమెదపడం లేదని మండిపడ్డారు. అటవీ అనుమతులు తీసుకురావాల్సిన ఆయన ఎందుకు మిన్నకున్నారని, ఈ కూల్చివేతకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మంగళవారం వైయస్ఆర్ జిల్లాలోని జ్యోతి కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలను వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జ్యోతిక్షేత్రంలోకాశి నాయన పరిత్యాగం చెందారని, ఆయన ఆలయాన్ని నిర్మించేందుకు అటవీశాఖ ఇబ్బందులు సృష్టించడం దురదృష్టకరమన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్రెడ్డి, గోవిందరెడ్డి సహకారంతో జ్యోతిక్షేత్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్కళ్యాణ్ సనాతన ధర్మవాదియై జ్యోతిక్షేత్రంలో కూల్చివేతలపై స్పందించకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో బద్వేల్ జెడ్పిటిసి పోలిరెడ్డి, అమగం పల్లి ప్రభాకర్ రెడ్డి, ఆమగంపల్లి సర్పంచ్ సురేష్, బద్దెల శ్యాంసుందర్ రెడ్డి, యల్లటూరు శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.