సంక్షేమంలో కొత్త ఒరవడి సృష్టించిన సీఎం వైయ‌స్‌ జగన్

మూడేళ్ళలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా దాదాపు రూ.2 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి..

బూతులతో మహానాడులో చంద్ర‌బాబు శునకానందం

వైయ‌స్ఆర్ సీపీ సామాజిక న్యాయ భేరికి ప్ర‌జ‌లు బ్రహ్మరథం

14 ఏళ్ళు సీఎంగా ఉండి చేయలేనిది.. ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు బాబూ...?

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ సుపరిపాలనకు మూడేళ్ళు పూర్తయ్యాయి అని  వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సంక్షేమం అంటే ఇలా ఉండాలి అని ప్రపంచానికి చూపిన ముఖ్యమంత్రి సీఎం వైయ‌స్ జగన్ అని అభివ‌ర్ణించారు. సంక్షేమంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు కొత్త ఒరవడిని సృష్టించారని తెలిపారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తూ, 95 శాతం హామీలు మూడేళ్ళలోనే నెరవేర్చి మేనిఫెస్టోకు కొత్త అర్థం చెప్పారని అన్నారు. మూడేళ్ళ పరిపాలనలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా దాదాపుగా రూ. 2 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో నేరుగా జ‌మ చేసిన ఘ‌న‌త సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సొంత‌మ‌ని కొనియాడారు. క‌డ‌ప వైయ‌స్ఆర్ సీపీ కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే...

నాడు- నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తూ, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెట్టి, కార్పొరేట్‌కు దీటుగా విద్య, వైద్యాన్ని పేద ప్రజలకు అందిస్తున్న ఘనత సీఎం వైయ‌స్ జగన్‌దే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా కులం, మతం, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ఇదే. తన గొప్ప ప్రజా పరిపాలన ద్వారా సీఎం వైయ‌స్‌ జగన్  పరపతి దేశవ్యాప్తంగా పెరుగుతుందని తెలిసి.. మహానాడు పేరుతో టీడీపీ నాయకులు ఒక బూతునాడును జరిపారు. సంస్కారం లేకుండా, దగ్గరుండి తన  పార్టీ నేతలతో చంద్రబాబు బూతులు మాట్లాడిస్తూ.. శునకానందం పొందాడు. ప్రభుత్వం ఏం మంచి చేసినా విమర్శించడమే టీడీపీ, జనసేన పార్టీలు పనిగా పెట్టుకున్నాయి. 

మరోవైపు రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రజలను రెచ్చగొడుతూ, విచక్షణ కోల్పోయి తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్నాయి. మహానాడులో చంద్రబాబు మాటలు చూస్తే.. ఆ రోజు అనుకుంటే, మీరు బయటకు వచ్చేవారా.. బతికి ఉండేవాళ్ళా.. అని బెదిరిస్తున్నాడు. మీరు అధికారంలో ఉంటే అదే చేస్తారా... అదే మేము ఆలోచన చేస్తే మీ పరిస్థితి ఏమిటో కూడా ఆలోచిస్తే బాగుంటుంది. చంద్రబాబులా  సీఎం వైయ‌స్ జగన్  కుట్రలు, కుతంత్రాలు చేయరు. రాష్ట్రం బాగుండాలని కోరుకుంటారు. సంక్షేమ ఫలాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అందాలని కోరుకోబట్టే, ఈ రోజు అందరికీ, గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. తన మాటలతో, చేష్టలతో ఏదో రకంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనే దుర్బుద్ధితో చంద్రబాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ప్రజల్లో తిరుగుబాటు రావాలని బాబు పగటి కలలు కంటున్నాడు. చంద్రబాబు ఎంత రెచ్చగొట్టినా ప్రజలు రెచ్చిపోరు. 

పార్టీలకు అతీతంగా ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా పథకాలు అందుతున్నాయి. ఈ విషయాన్ని మేం గర్వంగా చెబుతున్నాం. రాష్ట్రంలో ఏ గ్రామం వచ్చి అయినా, ఏ గడపకు వచ్చి అయినా మేం చెప్పగలం. 14 ఏళ్ళ తన పాలనలో ఎన్ని కుటుంబాలకు లబ్ధి జరిగిందో చంద్రబాబు చెప్పగలరా..? మేం గర్వంగా చెబుతున్నాం, ఈ మూడేళ్ళ సీఎం వైయ‌స్ జగన్ పాలనలో,  ఎవరికీ సలాంలు కొట్టకుండా, ఎవరి చుట్టూ తిరగకుండా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా కోటీ 14 లక్షల కుటుంబాలకు లబ్ధి చేశాం. 

ఇప్పటి వరకూ చంద్రబాబుకు ప్రజలు అధికారం అసలు ఇవ్వనట్టుగా, ఆయన అసలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయనట్టుగా, నన్ను గెలిపిస్తే అది చేస్తా.. ఇది చేస్తానని కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెట్టినవారు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. 14 ఏళ్ళలో మీరు ఏమీ చేయలేనిది, మీ పేరు చెబితే ఒక్క స్కీము కూడా గుర్తుకు రానిది, ఇప్పుడు కొత్తగా ఏమి చేస్తారు చంద్రబాబూ...? 

సామాజిక న్యాయ భేరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇది సీఎం వైయ‌స్‌ జగన్  మూడేళ్ళ పరిపాలనకు అద్దం పడుతుంది. ఆర్. కృష్ణయ్య లాంటి బీసీ జాతీయ నాయకుడికి, బీసీల కోసం పోరాడిన నాయకుడికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తే.. చంద్రబాబు పక్క రాష్ట్రం అంటూ విమర్శలు చేశారు, మరి ఆయన చేసింది ఏమిటో గుర్తుకు తెచ్చుకోవాలి. గురివింద గింజలా చంద్రబాబు తన నలుపును చూసుకోకుండా నీతులు చెప్పడం మానుకోవాలి. 

చంద్ర‌బాబు మాట్లాడితే.. ఆవు కథ మాదిరిగా హైదరాబాద్ ను నేనే కట్టాను అంటాడు. అది మీరు నిర్మించింది కాదు.. ఆ స్థానంలో అప్పుడు, మీ బామ్మర్ది బాలకృష్ణ ముఖ్యమంత్రిగా ఉన్నా ఐటీ అభివృద్ధి చెంది ఉండేది. చంద్రబాబు హయాంలో నక్సలిజం, ఇతర సమస్యలతో ప్రజా ప్రతినిధులు సైతం గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఉండేది. రాయలసీమ, కడప జిల్లాలను పదే పదే కించపరుస్తూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు. రాయలసీమకు ఒక్క మేలు చేయకుండా, అడుగడుగునా రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. 

అమరావతి రాజధాని కడుతున్నానని, 5 ఏళ్ళ పాటు ప్రజలను భ్రమల్లో పెట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, కోట్లు గడించాడు. అమరావతి రాజధాని పేరుతో రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టినా.. కనీసం అక్కడ ఒక టీ దుకాణం లేని పరిస్థితి. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ అధికారంలోకి వచ్చాక, మూడు ప్రాంతాలను సమగ్రాభివృద్ధి చేయాలని, మూడు రాజధానులు ప్రకటించి,  వైజాగ్‌ను పరిపాలనా రాజధానిగా చేద్దామంటే, కోర్టుల్లో కేసులు వేసి చంద్రబాబు అడ్డుకుంటున్నాడు, దీన్ని సైకో లక్షణం అనకుండా ఏమి అనగలం. మూడు ప్రాంతాలు బాగుండాలన్నదే మా ప్రభుత్వ విధానం. 

30 లక్షల మంది పేదలకు ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చి,  జగనన్న కాలనీల పేరుతో ఊళ్ళకు ఊళ్ళే నిర్మిస్తుంటే.. అవి మీ కళ్ళకు కనిపించవా చంద్రబాబూ.... ? పైగా పేదలకు ఇళ్ళు కట్టించలేదని చౌక బారు విమర్శలా..?  చంద్ర‌బాబుకు నేను సవాల్ విసురుతున్నాను. రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళ్ళి చంద్రబాబు - జగన్ నాయకత్వం మీద ప్రజల్లో ఓటింగ్ పెడితే సీఎం వైయ‌స్ జగన్కి 95 శాతం ఓట్లు వస్తాయి, చంద్రబాబుకు 5 శాతం కంటే తక్కువ ఓట్లు వస్తాయి. దీనికి సిద్ధమా..? అదీ సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వ పటిమ.

Back to Top