హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు కంగారు పడుతుందో అర్థం కావడం లేదని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్వస్తుందని తెలిసి కూడా వంద జీవోలు విడుదల చేశారని, ఊరికే రెండు సిట్లు ఏర్పాటు చేశారని, అవి ఎందుకు వేశారో ఎవరికి తెలియడం లేదన్నారు. డేటా చోరీపై సమాధానం చెప్పకుండా చంద్రబాబు తప్పించుకుంటున్నారని విమర్శించారు. శుక్రవారం బుగ్గన రాజేంద్రనా«ద్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా రెండు సిట్లు ఏర్పాటు చేసిందని తెలిపారు. సేవా మిత్ర యాప్కు సంబంధించిన ఒక సిట్, ఫామ్–7కు సంబంధించి మరో సిట్ను ఏర్పాటు చేశారన్నారు. ఫామ్–7 దర ఖాస్తు చేయడం తప్పుకాదని ద్వివేది చెప్పారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఎన్నికల కమిషన్ బాధ్యతలు కూడా టీడీపీనే చూసుకుంటుందా అని ప్రశ్నించారు. లేదా ఎన్నికల కమిషన్ మీ కింద బాధ్యతల్లో పని చేస్తుందని మీరు భావిస్తున్నారా అని చంద్రబాబును నిలదీశారు. ఎన్నికల కమిషన్ అన్నది ఇక ఇండిపెండెంట్ వ్యవస్థ అన్నారు. ఎన్నికలకు సంబంధించిన చర్యలు ఆ సంస్థ తీసుకుంటుందన్న విషయం ఇన్నేళ్ల అనుభవంలో చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. ఏపీలో కొన్ని లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని చెప్పారు. డబుల్ ఓట్లు ఉంటే వాటిని తొలగించేందుకు ఫామ్–7 దర ఖాస్తు చేస్తారన్నారు. ఏ కారణం వల్ల తొలగించారని, రెండో పేజీలో ఎవరు అర్జి పెడుతున్నారని, మూడో పేజీలో ఎవరి ఓటు తొలగించాలనే కాలం ఉంటుందన్నారు. ఫామ్–7 అప్లోడ్ చేయడంలో ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారని మండిపడ్డారు. ఉదాహరణకు కే.శ్రీనివాస్అనే వ్యక్తి పేరుతో ఒక చోట ఓటు ఉంటే..మరో చోట శ్రీనివాస్.కే పేరుతో మరో చోటు ఓటు ఉంటుంది. అలాంటి రెండు ఓట్లలో ఒక ఓటు తొలగించాలని ఆన్లైన్లో ఫారం–7 అప్లోడ్ చేస్తారన్నారు. వీటిపై ఎందుకు కేసు నమోదు చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ నమోదు చేసిన సెక్షన్లు 419 అంటే చీటింగ్ చేయడం, 182 సెక్షన్ అంటే తప్పుడు సమాచారం ఇవ్వడం, ఫామ్–7లో ఆధారాలతో సహా దరఖాస్తులు ఉంటాయి కదా అని ప్రశ్నించారు. 66–డీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారని తప్పుపట్టారు. ఓటుకు నోటు కేసులో అప్పట్లో ఇది మీ హక్కు కాదని తెలంగాణ ప్రభుత్వంతో వాదన చేసిన చంద్రబాబుకు ఈ విషయాలు తెలియవా అన్నారు. మీకైతే ఒక చట్టం..వేరే వారికైతే మరొక చట్టమా అని నిలదీశారు. సేవా మిత్ర యాత్ర యాప్లో టీడీపీ నిండా మునిగిపోయిందని, ఆ కేసును డైవర్ట్ చేసేందుకు ఫామ్–7పై 300లకు పైగా కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నారో టీడీపీ నేతలకే తెలియదన్నారు. దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే..వెంటనే ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందన్నారు. ఓట్ల తొలగింపు అంటూ మరో 8 మందితో మరో సిట్ ఏర్పాటు చేశారన్నారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీట్ విచారణలో 17 మంది ఉండగా వారంతా కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వారు ఒక్కరు కూడా ఉండరన్నారు. ఐటీ గ్రీడ్ అనే సంస్థ హైదరాబాద్లో ఉందని, అక్కడ నేరం జరిగితే ఈ కేసును ఏపీకి బదలాయించాలని కోరుతున్నారన్నారు. చంద్రబాబుకు నచ్చిన వారితో విచారణ చేయించుకోవాలన్నది వారి ఆలోచనగా ఉందన్నారు. ఎలాంటి ఆలోచన లేకుండా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ తుళ్లూరులో ఫిర్యాదు చేశారని తప్పుపట్టారు. ఫిబ్రవరి 23వ తేదీ ఈ వ్యవహారం వెలుగు చూసిందన్నారు. డేటా దొంగతనమే జరగలేదని, ఒకవేళ జరిగితే దానివిచారణకు ఒక జూనియస్ అధికారి చాలు అంటూ ఉచిత సలహా ఇచ్చారన్నారు. ఏపీకి సంబంధించిన అంశమైనా..జరిగింది హైదరాబాద్లోనే అని గుర్తు చేశారు. నారా లోకేష్ నాయుడు గదిలో కూర్చొని రోజుకో ట్వీట్ చేస్తున్నారని, ఆయన వద్ద సమాచారం ఉంటే బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. అధికారులేమో ఏ డేటా చోరీ జరగలేదని చెబుతున్నారని, టీడీపీ నేతలేమో దొంగతనం జరిగిందంటున్నారని చెప్పారు. దొంగతనం జరిగిందా? మీరే ఇచ్చారా అన్నది మేమంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో 3 కోట్ల టీడీపీ సభ్యత్వం ఉందా అని నిలదీశారు. గత నెల 27వ తేదీ నుంచి ఎందుకు యాప్ను నిర్వీర్యం చేశారన్నారు. అశోక్ను ఎందకు దాచిపెట్టారన్నారు. ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పడం లేదన్నారు. వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రీడ్కు ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. వాళ్లే ఇచ్చారా? లేదా దొంగతనం జరిగిందా అని ప్రశ్నించారు. బ్యాంకు డిటెల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పకుండా సిట్ వేస్తే ఏం ప్రయోజనమన్నారు. 2018 నుంచి ఇంతవరకు లక్షల ఓట్లు తొలగించారన్నారు. తొలగించిన ఓట్లకు ఫీల్డ్ రిపోర్టు ఉందా అన్నారు. అందరూ ఒక్కటయ్యారని ఏడుస్తూ..తానొక్కడినే నిజం చెబుతున్నారని చంద్రబాబు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. అందరూ అబద్ధం చెబితే ఆయనొక్కరే నిజం చెబుతారా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనంతా అవినీతిమయమే అన్నారు. మూడు రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తోందని చాటుగా 100 జీవోలు ఇచ్చారని విమర్శించారు. పదే పదే సామాజిక న్యాయం అని చెప్పే చంద్రబాబు బుట్టా రేణుక విషయంలో చేసింది ఏంటని ప్రశ్నించారు. కదిరి ఎమ్మెల్యే చాంద్బాషాను మంత్రిని చేస్తానని మోసం చేశారన్నారు. ఇప్పుడు ఆయనకు టికెట్టే లేకుండాపోయిందన్నారు. అందరిని ఏడిపిస్తూ చంద్రబాబు మాత్రం సమాజ వికాసం..కుటుంబ వికాసం పేర్లు పెట్టి డేటా దొంగిలిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలంతా రోజులు లెక్కపెడుతున్నారని, ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందో ఎదురు చూస్తున్నారని బుగ్గన రాజేంద్రనా«ద్రెడ్డి పేర్కొన్నారు.