పోలవరం నిర్మాణం వైయస్‌ జగన్‌  కర్తవ్యంగా భావించారు

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

వైయస్‌ఆర్‌ అకాల మరణంతో పోలవరం పనులు నిలిచిపోయాయి

విభజన ఏపీలో పోలవరం కేంద్ర ప్రాజెక్ట్‌గా ఆమోదించబడింది

బాబు హయాంలోనే పనులు వేగంగా జరిగుంటే 2018లోనే పోలవరం పూర్తయ్యేది

కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడటంతో పోలవరం ఆలస్యమైంది

పోలవరం పనులను పరిశీలించిన సజ్జల రామకృష్ణారెడ్డి బృందం

పోలవరం: పోలవరం నిర్మాణం తన కర్తవ్యంగా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భావించారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లోనూ పనులు ఆగకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేసిన మహానీయుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసిన అపర భగీరథుడని కొనియాడారు. వైయస్‌ఆర్‌ అకాల మరణంతో పొలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని చెప్పారు. కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడటంతో పోలవరం ఆలస్యమైందని, వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు వేగం పెరిగిందన్నారు. బుధవారం పోలవరం ప్రాజెక్టును సజ్జల రామకృష్ణారెడ్డి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి స్వప్నం పోలవరం ప్రాజెక్టు.. ఈ రోజు మహానేత కుమారుడు వైయస్‌ జగన్‌ ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తున్న నేపథ్యం ఒక చారిత్రక సన్నివేశం. దాదాపు వందేళ్ల కల పోలవరం. 2005లో తొలిసారి వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి చేయాలని, రాష్ట్రం మొత్తాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి పోలవరం, కృష్ణాడెల్టాకు ప్రాణమైన పులిచింతల, ఎడారిగా మారుతున్న రాయలసీమకు పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు చేపట్టడం ఒకేసారి మూడు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు పనులు ఆ రోజు పునాది రాయి వేశారు. చిరస్థాయిగా నిలిచిపోయే ప్రాజెక్టులకు ఆ రోజు మహానేత పునాది రాయి వేశారు. అందుకే ఈ రోజు తెలుగు ప్రజలు మహానేతను తలుచుకుంటున్నాం. దేశంలోనే ఆదర్శప్రాయుడైన నేతగా, అపర భగీరథుడిగా వైయస్‌ఆర్‌ నిలిచిపోయారు.

ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన అడుగు పడితే..దురదృష్టవశాత్తు మహానేత అకాలమరణమైతే..రెండో చారిత్రాత్మక ఘట్టం రాష్ట్ర విభజన. పునర్విభజన చట్టంలో పోలవరాన్ని కేంద్రమే నిర్మించాలి. లక్ష కోట్లు,,రెండు లక్షల కోట్లు అయినా కేంద్రమే భరించాలి. 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడం మన దురదృష్టం. 2016లో చంద్రబాబు కాంక్రీంట్‌ పనులను ప్రారంభించారు. 2018 నాటికి పోలవరం పనులు పూర్తి కావాల్సింది. కేంద్రంతో కలిసి అధికారాన్ని పంచుకున్న చంద్రబాబు పోలవరాన్ని తన కమీషన్ల కోసం తాకట్టు పెట్టారు. 

మన ప్రభుత్వం వచ్చాక..సీఎం వైయస్‌ జగన్‌ టార్గెట్‌ పెట్టుకొని ప్రణాళికబద్ధంగా పనులు చేయిస్తున్నారు. దీని ఫలితమే ఈ నెల 12వ తేదీ తొలిసారి స్పీల్‌వే ద్వారా గోదావరి నీటిని మళ్లించామని గర్వంగా చెప్పుకుంటున్నాం. వైయస్‌ జగన్‌ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఈ పరిణామాన్ని రాష్ట్రమంతా సంబరాలు చేసుకోవాల్సిన సందర్భం. వైయస్‌ జగన్‌ ఒక దీక్షతో ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి పనులు పరుగులు పెట్టిస్తున్నారు. అందరి కృషితో పనులు ఎక్కడా ఆగకుండా కష్టకాలంలోనూ కొనసాగుతున్నాయి. ఇది పూర్తి కావడం, వడివడిగా అడుగులు పడుతుండటం సంతోషంగా ఉంది. ఇప్పటికే మెయిన్‌ డ్యామ్‌ పనులు పూర్తి కావాల్సింది. అయితే గత ప్రభుత్వ హయాంలో కట్టిన డయఫ్రం వాల్‌ను మళ్లీ రిపేరీ చేయాల్సి వస్తోందన్నారు. ఆ రోజు ఒక ప్లాన్‌ లేకుండా టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల కోసం నీళ్లు విడుదల చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారు. పోలవరం వద్ద క్యాట్‌ వాక్‌లతో, పట్టిసీమతో నాలుగు చెంబుల నీళ్లు ఇచ్చి జిమ్మిక్కులు చేశారు. అందుకే ఆయనకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. అయినా కూడా సీఎం వైయస్‌ జగన్‌ పోలవరంపై చిత్తశుద్ధితో దృష్టిపెట్టారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై కూడా సీఎం వైయస్‌ జగన్‌ దృష్టి పెట్టారు. అనుకున్న సమయానికి పోలవరాన్ని పూర్తి చేస్తారన్న నమ్మకం మాకు కలిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

2014లో పోలవరం పనులు మొదలు పెట్టి ఉంటే ఈ పాటికి పూర్తి అయ్యేదని మీడియా ప్రశ్నలకు సజ్జల సమాధానం చెప్పారు. ఆ రోజు వాళ్లు పూర్తి చేసి ఉంటే చరిత్రలో నిలిచిపోయేవారు కదా?. అప్పుడు జరిగిన పని..ఇప్పుడు జరిగిన పనిని మీరు కూడా బేరీజు వేసుకొని చూడండి. గత ప్రభుత్వం పునరావాసం విషయాన్ని ఎందుకు మరిచిపోయింది. వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కాల్వలు తవ్విస్తే..చంద్రబాబు మోటర్లు పెట్టి నీళ్లు వదిలి జిమ్మిక్కులు చేశారు. తన తండ్రిలాగే రైతుల హృదయాల్లో నిలిచిపోవాలనే తపనతో ఈ రోజు వైయస్‌ జగన్‌ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు.

ఒక స్వప్నం ఆవిష్కృతమైనప్పుడు మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. 2022 ఖరీఫ్‌ నాటికి పోలవరం నుంచి నీటిని ఇస్తామని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలపెట్టారు. అందుకు అనుగుణంగా పనులు పూర్తి చేయిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

 

Back to Top