తాడేపల్లి: ఎన్నో పోరాటలు చేసి వైయస్ జగన్మోహన్రెడ్డి నాయకుడిగా ఎదిగారని, పోరాట పటిమతో వైయస్ఆర్సీపీ ఎదిగిందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయనతో పాటు లక్ష్మీపార్వతి, ఎంవీఎస్ నాగిరెడ్డి కేక్ కట్ చేసి శుభాభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. వైయస్ఆర్సీపీ ప్రజల పక్షమని తెలిపారు. ప్రజలతో మమేకమైన రాజకీయాలే తమకు తెలుసునని పేర్కొన్నారు. అవినీతిరహిత సమాజం కోసం పాటు పడుతున్నామని చెప్పారు. టీడీపీని డ్రామాల పార్టీగా సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే చంద్రబాబు కుట్ర అని మండిపడ్డారు. బుద్ధా వెంకన్న, బోండా ఉమాలను మాచర్ల ఎందుకు వెళ్ళారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. డీజీపీ ఆఫీస్ ముందు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అంబటి, ముస్తఫాను హత్య చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని గుర్తు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం వైయస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించిందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా సంయమనంతో వ్యవహరించామని పేర్కొన్నారు. ప్రజలు తిరస్కరించిన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. ఒక ఉద్యమంలా మొదలై.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వైయస్ఆర్సీపీ ఒక ఉద్యమంలా మొదలై అధికారంలోకి వచ్చిందని సజ్జల తెలిపారు. 2009లో మహానేత వైయస్ రాజశేఖర్రెడ్డి మరణంతో వందలాది గుండెలు ఆగిపోయాయన్నారు. వైయస్ఆర్ మరణం తర్వాత రాష్ట్రంలో చీకటి అలుముకుందన్నారు. ఆయన మరణం తర్వాత ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఎన్నో లక్షల మంది పార్టీ ఆవిర్భావం తర్వాత వైయస్ జగన్మోహన్రెడ్డితో కలిసి అడుగులు వేశారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైయస్ జగన్ 51 శాతం ఓట్లు సాధించారని తెలిపారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఆరు నెలలోనే ఇచ్చిన హామీలను 80 శాతం నెరవేర్చారని పేర్కొన్నారు. ప్రతి పథకాన్ని పేదలకు చేరుస్తున్నారని వెల్లడించారు. ప్రజలు పెట్టుకున్న ఆశలకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.