అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం తెలిపింది. అయితే బిల్లులు ప్రతిపాదించే సమయంలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల ఆమోదం తరువాత సీఎం సభలో మాట్లాడుతూ..40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే టీడీపీ నేతలు బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసే బిల్లులను అడ్డుకోవడం దారుణంగా ఉందన్నారు. బీసీ వర్గానికి చెందిన స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టడం అభ్యంతరకరమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా బిల్లు ఆమోదించామని సీఎం చెప్పారు. ఇంతటి కీలకమైన బిల్లులకు ఆమోదం తెలపాల్సింది పోయి ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టడం సిగ్గుచేటు అన్నారు. ఎక్కడైనా కూడా ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత క్లారిఫికేషన్ మాత్రమే ఉంటుందని, గతంలో మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్లారిఫికేషన్కు కనీసం రెండు నిమిషాలు కూడా సమయం కేటాయించలేదని విమర్శించారు. చారిత్రాత్మక బిల్లులకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులను దేవుడు శిక్షిస్తాడని, ప్రజలు గుణపాఠం చెబుతారని వైయస్ జగన్ హెచ్చరించారు. కాగా, చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం తెలపడం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారని కొనియాడారు.