ఏపీలో పునరుత్పాదక ఇంధన రంగంలో 13,745 కోట్ల పెట్టుబడి

రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగంపై 13,745 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్లు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. 2017-18 నుంచి ప్రారంభించిన ఈ పెట్టుబడులు 2022-23 వరకు కొనసాగుతాయి. గడచిన అయిదేళ్ళ కాలంలో రాష్ట్రంలో చేపట్టిన అనేక పునరుత్పాదక ఇంధన స్కీములు, కార్యక్రమాల అమలు కోసం కేంద్ర సాయం కింద 454 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర‌మంత్రి చెప్పారు. దేశంలో పవర్‌ గ్రిడ్‌తో అనుసంధానమైన సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్ట్‌లలో అత్యధికం ప్రైవేట్‌ డెవలపర్స్‌ అభివృద్ధి చేసినవేనని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు తమ మంత్రిత్వ శాఖ అయిదు సోలార్‌ పార్క్‌లు మంజూరు చేసినట్లు కేంద్ర‌మంత్రి పేర్కొన్నారు. ఆ అయిదు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పురోగతి  వివరాలు ఇలా ఉన్నాయి...అనంతపురంలో 1500 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్‌ పార్క్‌ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. అనంతపురం జిల్లాలోని ఎన్‌పీ కుంట, కడప జిల్లాలోని గాలివీడులో 9592 ఎకరాలలో ఇప్పటికే 1400 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్‌ ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. మరో 100 మెగావాట్లకు సంబంధించిన  ప్రాజెక్ట్‌ డెవలపర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయాల్సి ఉందని కేంద్ర‌మంత్రి తెలిపారు. అలాగే కర్నూలు జిల్లా గని, శకునాల గ్రామాల్లో 1000 మెగా వాట్ల సామర్ధ్యంతో 5568 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ పార్క్‌ ప్రారంభమైనట్లు చెప్పారు. కడప జిల్లాలో 1000 మెగావాట్ల సామర్ధ్యంతో 5600 ఎకరాలలో ప్రారంభించిన సోలార్‌ పార్క్‌ పనులు పురోగతిలో ఉన్నాయి.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారి చెరువు, ఆలూరు గ్రామాల్లో 2751 ఎకరాల్లో 500 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న సోలార్‌ పార్క్‌కు సంబంధించి మౌలిక వసతుల కల్పన పూర్తయింది. ఇప్పటికే 400 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్స్‌లలో ఉత్పాదన ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలోని రామగిరి, ముత్తువకుంట్ల గ్రామాల్లో 200 మెగావాట్ల సామర్ధ్యంతో నెలకొల్పుతున్న సోలార్‌, విండ్‌ హైబ్రీడ్‌ పార్క్‌కు సంబంధించి డీపీఆర్‌ను ఇంకా సమర్పించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం 690 ఎకరాల భూసేకరణ జరిగింది. పార్క్‌లో మౌలిక వసతుల కల్పన పనులు కొనసాగుతున్నాయని కేంద్ర‌మంత్రి తెలిపారు.

జీఎస్టీ వసూళ్ళలో 37 శాతం వృద్ధి
ఇటీవల కాలంలో జీఎస్టీ వసూళ్ళలో గణనీయమైన వృద్ధి నమోదవుతున్నట్లు ఆర్థిక శాఖ సహాయ కేంద్ర‌మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబిస్తూ 2022-23 తొలి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్ళు సగటున నెలకు 1.51 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన జీఎస్టీ వసూళ్ళతో పోల్చుకుంటే 37 శాతం వసూళ్ళు పెరిగాయని చెప్పారు. జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపును మరో అయిదేళ్ళపాటు పొడింగించాలన్న వివిధ రాష్ట్రాల డిమాండ్‌పై ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ ఏం నిర్ణయించింది అన్న ప్రశ్నకు కేంద్ర‌మంత్రి నేరుగా సమాధానం చెప్పకుండా జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపును మరో అయిదేళ్ళపాటు కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కొన్ని రాష్ట్రాలు కోరిన మాట వాస్తవమేనని కేంద్ర‌మంత్రి అంగీకరిస్తూ జీఎస్టీ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి  అయిదేళ్ళపాటు రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించే రాజ్యాంగపరమైన హామీకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

Back to Top