ఆగస్టు 7న ` టీటీడీ కల్యాణమస్తు` 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల‌తో పునఃప్రారంభం

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక వివాహాలు

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి 

తిరుమ‌ల‌:  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయ ప్రాంగ‌ణంలో టీటీడీ చైర్మ‌న్ మీడియాతో మాట్లాడారు. దివంగత మ‌హానేత వైయ‌స్ రాజేశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహించారని చెప్పారు. ఆయన మరణం తరువాత ఈ కార్యక్రమం నిలిపివేశారనీ, ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ఆదేశాల‌తో క‌ల్యాణ‌మ‌స్తు పునఃప్రారంభించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుందన్నారు. 

పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపించనున్నామని చెప్పారు. ఆగస్టు 7వ తేదీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఆదివారం ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో వివాహాలు జరిపించాలని పండితులు సుముహూర్తం నిర్ణయించారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అర్హులైన వారందరూ ఆయా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు.  ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలు జరిపిస్తామని చెప్పారు.

Back to Top