తిరుమల : తిరుమలలోని క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, నారాయణ గిరి ఉద్యానవనం, బూందిపోటులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తనిఖీ చేశారు. తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బూందిపోటులో స్టీమ్తో లడ్డూల తయారీని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించేడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. వైవీ సుబ్బారెడ్డిని కలిసిన ప్రముఖ గాయని శోభారాజు తిరుమల : ప్రముఖ గాయని పద్మశ్రీ శోభారాజు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. టీటీడీలో పాటలు పాడే అవకాశాన్ని తనకు ఇవ్వాలని శోభారాజు కోరారు. శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ)లో తప్పకుండా అవకాశం కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. నలభై ఏళ్లుగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నా.. టీటీడీ నుంచి సరైన గుర్తింపు లభించలేదని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. టీటీడీ తనకు ప్రకటించిన ఆస్థాన విద్వాంసురాలు పదవి కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో తన సేవలను ఉపయోగించుకుంటామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్లు శోభారాజ్ తెలిపారు.