తాడేపల్లి: పరామర్శ పేరుతో చంద్రబాబు డర్టీపాలిటిక్స్ చేస్తున్నారని, శవాల దగ్గర ఓట్లు అడుగుతాడా అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థి అమర్నాథ్ హత్య దురదృష్టకరమని తెలిపారు. ఎవరి ఇంట్లోనూ ఇలాంటి ఘటనలు జరగకూడదని అన్నారు. ఘటన జరిగిన వెంటనే సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల సాయం అందించామని పేర్కొన్నారు. నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేశామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దోషులకు శిక్షపడేలా చేస్తామని చెప్పారు. పరామర్శ పేరుతో బాబు డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. పరామర్శ పేరుతో ఓట్లు అడుక్కున్న బాబుః రాన్రానూ చంద్రబాబుకు మతిభ్రమించిందేమో.. నిన్న రేపల్లె నియోజకవర్గం ఉప్పాలవారిపాలెంలో మృతిచెందిన అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి అక్కడ శవరాజకీయం చేశాడు. డర్టీ పాలిటిక్స్కు కేరాఫ్గా ఈ చంద్రబాబును చెప్పుకోవాల్సిందే. ఎవరైనా ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు బాధితుల్ని కలిసి వారితో మాట్లాడి వీలైతే సాయం చేసి ధైర్యం చెబుతారు. కానీ, ఈ దిక్కుమాలిన చంద్రబాబు మాత్రం అమర్నాథ్ సోదరి, తల్లిని కలిసి బయటకొచ్చి సభపెట్టి శవాలపై పేలాలేరుకున్నట్లు ఓట్లు అడుక్కున్నాడు. ఇంత బుద్ధిలేని పని ఏ నాయకుడైనా చేస్తాడా..? ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలాంటి నీచరాజకీయం చేస్తాడు. పైగా, బాధలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చడానికి గుంపుగా, ఊరేగింపుగా వెళ్లాడు ఈ చంద్రబాబు. ఇతని బడాయి పరామర్శ తీరును చూసి స్థానిక ప్రజలంతా బాబు శవరాజకీయం గురించి మాట్లాడుకుంటున్నారు. అమర్నాథ్ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉన్నాంః విద్యార్థి అమర్నాథ్ హత్య జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. తన సోదరిని కీచకుల వేధింపుల నుంచి కాపాడాలని ప్రయత్నించిన క్రమంలో అమర్నాథ్ హత్యకు గురవడం అందర్నీ బాధిస్తోంది. ఎవరి ఇంట్లోనూ ఇలాంటి ఘోరం జరగకూడదు. ఇలాంటి ఘటనల్ని తీవ్రంగా మేం ఖండిస్తున్నాం. ఈ ఘోర ఘటన జరిగిన వెంటనే మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు తీవ్రంగా చలించిపోయారు. జరిగిన ఘోరంపై ప్రభుత్వపరంగా హుటాహుటిన స్పందించడం.. ఇంతటి కిరాతకానికి పాల్పడిన నలుగురు నిందితుల్ని కేవలం 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేయడం, వారిని కోర్టు ముందు హాజరుపెట్టి రిమాండ్కు కూడా తరలించడం జరిగింది. మరోవైపు బాధిత కుటుంబాన్ని ఆదుకునే చర్యలు చేపడుతూ, ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్రెడ్డి గారు తక్షణమే వారికి రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించడం జరిగింది. దీంతోపాటు ఇంకా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఘటన జరిగిన రోజునే స్థానిక ఎంపీ శ్రీ మోపిదేవి వెంకట రమణ గారు అక్కడకు వెళ్లారు. ప్రభుత్వ సాయం గురించి వివరించడంతో పాటు ఆయన సైతం సొంతంగా రూ.1లక్ష తక్షణ సాయాన్ని బాధితులకు అందజేయడం జరిగింది. ఆ తర్వాత రోజు మేమూ కూడా ఉప్పాలవారి పాలెంకు వెళ్లి అమర్నాథ్ కుటుంబాన్ని కలిసి ప్రభుత్వసాయం అందజేశాం. ఆమె కోరుకున్న చదవు.. లేదంటే ఉద్యోగమిస్తాంః అమర్నాథ్ సోదరి, తల్లిని కలిసి మాట్లాడి వారికి ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా అండగా ఉంటామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసానిచ్చిన సంగతిని వివరించాం. బాధితుని సోదరికి ఇప్పటికిప్పుడు ఉద్యోగం కల్పించడంతో పాటు తాను చదువుకుంటానంటే ఆ బాధ్యతను సైతం ప్రభుత్వమే చూసుకుంటుందంటూ వారికి వివరించి ధైర్యం చెప్పాం. వీటితోపాటు వారి కుటుంబానికి ఇప్పటికే ఇంటి స్థలం మంజూరు చేయడంతోపాటు ఇంటి నిర్మాణం కూడా చేపడతామని చెప్పిన ప్పుడు వారు ఊరటపొందారు. కులాల్ని రెచ్చగొడుతున్న టీడీపీః ఘటన జరిగిన వెంటనే అక్కడకు మా ఎంపీ శ్రీ మోపిదేవి వెంకటరమణ చేరుకున్న క్రమంలో కొందరు స్థానిక టీడీపీ ప్రబుద్ధులు శవరాజకీ యం చేసి కులాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రేపల్లె నియోజకవర్గం చుట్టుప్రక్కల గ్రామాల వారు ఉప్పాలవారిపాలెంకు రావాలంటూ టీడీపీ వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టుకున్నారు. మరీ ఇంత శవరాజకీయం అవసరమా..? అని నేను మృతుని సామాజికవర్గానికి చెందిన వ్యక్తిగా, ఒక మంత్రిగా అడుగుతున్నాను. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఎక్కడంటే అక్కడ, సమయాన్ని, సందర్భాల్ని పట్టించుకోకుండా రాజకీయాలు చేయడం, శవాల దగ్గర ఓట్లు అడుక్కునే నీచమైన బుద్ధి ఒక్క టీడీపీకి తప్ప ఏ ఒక్కరికీ ఉండదని తెలియజేస్తున్నాను. టీడీపీ శవరాజకీయం గురించి బాధితులే చెబుతున్నారుః మేం బాధిత కుటుంబాన్ని కలిసినప్పుడు మాట్లాడుతూ.. ‘అమ్మా.. మీకు ప్రభుత్వపరంగా ఇంకా ఏంకావాల్నో.. జగన్మోహన్రెడ్డి గారు అడగమన్నారు’ అని చెప్పగానే.. వారు చాలా ఊరటపొంది కొన్ని విషయాల్ని చెప్పారు. తమకేమీ రాజకీయ విషయాలు తెలీయదని.. కొందరు టీడీపీ నేతలొచ్చి ఏవేవో చెప్పి తాము చెప్పినట్లు వినాలని వత్తిళ్లు చేశారని ..తమకు చాలా అయోమయంగా ఉందని వారు చెప్పారు. మా అబ్బాయికి జరిగినటువంటి ఘోరం మరొకరికి జరగకుండా చూడాలని అమర్నాథ్ తల్లి, సోదరి చెప్పారు. వారి కోరిక మేరకు ఈ కేసుపై ఫాస్ట్ట్రాక్ విచారణ జరిపి నిందితులకు వీలైనంత వేగంగా శిక్ష పడేలా చేస్తామని మేం హామీనిచ్చాం. ఆడబిడ్డ ప్రేమానురాగాలు నీకేం తెలుసు బాబూ..?ః పరామర్శకు వెళ్లిన ఈ ముసలి నక్క చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. ఆడబిడ్డల అనురాగం, ప్రేమ గురించి మాట్లాడుతూ .. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తాడా..? నిజానికి, ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల భవిష్యత్తుపై ఆలోచిస్తున్న ఏకైక వ్యక్తి జగన్ గారు అని మేం గర్వంగా చెబుతున్నాం. తన ఇద్దరి ఆడబిడ్డల మాదిరిగానే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ చక్కగా చదువుకోవాలని.. వారికి వారు సొంతకాళ్లమీద నిలబడేలా ఉపాధి ఉండాలని తపిస్తున్న నాయకుడు మా జగన్గారు అని గుర్తుచేస్తున్నాం. అయితే, ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల అనురాగం, ప్రేమ గురించి తెలియని విలువల్లేని నీచుడెవరైనా ఉన్నారంటే, అది చంద్రబాబేనని చెప్పాలి. ఆయనకు ఎటూ ఆడబిడ్డల సంతానం లేదుకనుక వారి అనురాగం, ఆప్యాయత, ప్రేమల గురించి అతనికి తెలియదు గనుకనే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. బాబు హయాంలో ఆడబిడ్డల ఆక్రందలెన్నోః ఈరోజు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్న చంద్రబాబును, ఆయన పరిపాలనలో జరిగిన కొన్ని సంఘటలపై నేను ప్రశ్నిస్తున్నాను. వాటికి ఆయన సమాధానం చెప్పాల్సిందే. బాబు హయాంలో ఆడబిడ్డల్ని, వారి తల్లుల్ని ఎంతగా హింసించారో అందరికీ తెలుసు. రిషితేశ్వరి కేసులో నిందితుడ్ని రక్షించడంతో పాటు వనజాక్షి అనే తహశీల్దార్ను జుట్టుపట్టుకుని ఈడ్చుకునే వెళ్లింది బాబు హయాంలోనేనని గుర్తులేదా..? అని అడుగుతున్నాను. నీ హయాంలో నీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాష్టికాలపై రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు జరిగిన విషయాలను మీరు మరిచిపోయారా..? అని అడుగుతున్నాను. అదేవిధంగా విజయవాడలో కాల్మనీ సెక్స్రాకెట్ నడిపి ఆడబిడ్డల మానప్రాణాల్ని దోచుకుంది టీడీపీనాయకులు కాదా..? అందుకే, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలంతా 2019 ఎన్నికల్లో మీకు గుండుగీసి సున్నం బొట్టు పెట్టారన్న సంగతిని గుర్తుకుతెచ్చుకోండి. బాబును బీసీ సోదరులెప్పుడో వదిలేశారుః అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోరకంగా ప్రవర్తించే ముసలినక్క చంద్రబాబు నైజం గురించి బీసీ సోదరులకు బాగా అర్థమైంది. కనుకనే ఆయనెంతగా కులాల్ని రెచ్చగొట్టి తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించినా.. బీసీ సోదరులు ఆయన మాటల్ని నమ్మరు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నప్పుడే వాళ్లంతా చంద్రబాబును వదిలేశారు. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్కళ్యాణ్లు శవరాజకీయాలు మానుకోవాలని హితవుపలుకుతున్నాను. చాపాదిండు పట్టుకుని పారిపో పవన్కళ్యాణ్ః ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలుపడానికి ఏ సమస్యా పెద్దగా కనిపించడంలేదు. అందుకే, కనిపించిన ప్రతీ చిన్న సమస్యను బూతద్దంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సమస్య చిన్నదా పెద్దదా అని కాకుండా ప్రతీదాన్ని పట్టుకుని గవర్నర్ గారిని కలిసి చంద్రబాబు, దత్తపుత్రుని టీమ్ వారి ఉనికి చాటుకునే ప్రయత్నాలకు పాకులాడుతున్నాడు. కాపులకు సంబంధించిన అంశాల్లో లోతైన విశ్లేషణతో ముద్రగడ గారు రాసిన లేఖను ఆసాంతం చదివితే పవన్కళ్యాణ్ చాపాదిండు పట్టుకుని హైదరాబాద్ పారిపోవడం ఖాయం. కాకపోతే, ఆయన దాన్ని చదువుతాడో లేదో.. పూటకోమాట మాట్లాడే పిచ్చోడు పవన్కళ్యాణ్ః ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయ చరిత్ర అయిపోయింది. అటు లోకేశ్ పాకులాడినా.. ఇటు పవన్ వారాహీ ఎక్కి తిరిగినా వీరిలో ఏ ఒక్కరూ ఎన్నికల్లో గెలిచేది లేదు. పవన్కళ్యాణ్ పూటకో మాట చెబుతూ తానేదో పెద్ద వ్యూహకర్తననే భ్రమల్లో బతుకుతున్నాడు. కాసేపు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీలో అడుగుపెడతానంటాడు. ఇంకోరోజేమో మీరు నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండని ప్రజల్ని అడుక్కుంటాడు. ఆయన మాట్లాడే మాటలకు ఈ పిచ్చోడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ అభిమానులు, అనుచరులు తలలుపట్టుకుని కూర్చొన్నారు. 2019లో పోటీ చేసిన రెండుచోట్ల చాచి చెంప పగులకొట్టినట్టు పవన్కళ్యాణ్ను ప్రజలు ఓడించారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ .. సీఎంగా గెలుస్తాడా.. అన్నది ఆలోచించుకోవాలి. ఇలాగే వారాహీ ఎక్కి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే రేపు 2024లో కూడా తీవ్రమైన, ఘోరమైన అవమానంతో ఆంధ్రరాష్ట్రం మొఖం చూడకుండానే పారిపోవడం ఖాయం.