చిత్తూరు: వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ తిరుపతి నగరంలో వైయస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ‘‘మేముసైతం చెవిరెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తున్నాం.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.. అందులో భాగమే చెవిరెడ్డిని లిక్కర్ స్కాం కేసులో ఇరికించడం.. ఆయననే కాదు.. ఆయన బిడ్డను కూడా అందులో కలపడం దుర్మార్గం.. ఇంతకన్నా నీచమైన పని మరొకటి ఉండదు.. అక్రమ అరెస్టులతో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం కూలిపోక తప్పదు.. చెవిరెడ్డిని, ఆయన బిడ్డను తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాలని పన్నుతున్న కుట్రలు చాలా కాలం నిలబడవు.. చెవిరెడ్డితో పాటు ఆయన కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం.. రెట్టింపు ఉత్సాహంతో పార్టీని ముందుకు నడిపిస్తాం.. వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి మోహిత్రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకుని మీ కథ తేలుస్తామని హెచ్చరిస్తున్నాం..’’ అంటూ వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. పాకాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్దనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు మీరు రాసిన రాజ్యాంగం మరుగునపెట్టి వారు తెచ్చుకున్న రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అమాయకులను జైలు పాలు చేస్తున్నారు.. కూటమి పెద్దల కళ్లు తెరపించడానికి మీరు మల్లీ పుట్టాలి అంటూ అంబేద్కర్ విగ్రహం ముందు మొరపెట్టుకున్నారు. అంతకు ముందు పార్టీ జెండాలతో పాటు నల్ల జెండాలను చేత బట్టుకున్న పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, చెవిరెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ కొంత దూరం ర్యాలీ చేశారు. అనంతరం పలువురు పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ చంద్రగిరి ప్రజలు అందరికీ చెవిరెడ్డి ఏమిటి..? ఆయన కుటుంబ పరిస్థితులు ఏమిటి..? ఆయన ప్రజలకు చేసిన సేవలు ఎంత..? అన్న విషయాలు తెలుసనన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష కట్టి చెవిరెడ్డితో పాటు ఆయన కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతోందని, ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్న అధికారులు, పెట్టిస్తున్న నాయకులు భవిష్యత్తులో అంతకు అంత అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలకు ఇస్తామన్న సంక్షేమ పథకాలను పక్కదారి పట్టించి ప్రతిపక్షం లేకుండా చేయడానికి అన్ని రకాల కుట్రలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే వున్నాయన్నారు. చెవిరెడ్డి వంటి ప్రజల మనిషిని జైలు పాలు చేసిన వీరికి పాలించే అర్హత లేదన్నారు. పోలీసులు కూడా కూటమి పెద్దలు చెప్పినట్టల్లా ఆడుతున్నారని, చట్టాన్ని న్యాయాన్ని పరిరక్షించడం ఎప్పుడో మరచిపోయారన్నారు. గత ఏడాది కాలంగా ఏపీలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎక్కడా అమలు కావడం లేదన్నారు. నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుండటం వల్ల ప్రజాస్వామ్యం కనబడకుండా పోయిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, చెవిరెడ్డిని అక్రమ కేసుల్లో నుంచి త్వరగా బయటకు తీసుకురావడం కోసం నిరతరం పోరాడుతామన్నారు. కూటమి ప్రభుత్వం చెవిరెడ్డికి, ఆయన కుటుంబానికి చేసిన ద్రోహాన్ని చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తెలియపరుస్తామన్నారు. చెవిరెడ్డి కుటుంబంకు తాము తోడుగా నిలబడతామని, తప్పులు చేస్తున్న పోలీసులు సైతం ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. చెవిరెడ్డికి, ఆయన కుమారుడు మోహిత్రెడ్డికి సంబంధం లేని కేసుల్లో అరెస్టులు చేస్తూ ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమన్నారు. ఈ నిరసన ర్యాలీలో చంద్రగిరి, పాకాల, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, రామచంద్రాపురం, తిరుపతి రూరల్ మండలాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.