ప్రకాశం జిల్లా: ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని ఉలిచి గ్రామంలో దేవరంపాడు గ్రామసర్పంచ్ కనుమూరి మహాలక్ష్మికి చెందిన పూరిపాకలను రాజకీయ కక్షతో నిప్పంటించారు. తగులబెట్టిన ప్రాంతాన్ని వైయస్ఆర్సీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త చుండూరు రవి తో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు పరిశీలించారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కనకారావు మాట్లాడుతూ ..తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులపై దాడులు, దళిత మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, ఎన్డీయే కూటమికి దళితులు ఓట్లు వేయలేదనే కక్షతో వేధింపులకు గురిచేస్తున్న క్రమంలోనే దళిత సర్పంచ్ మహాలక్ష్మి కి చెందిన పూరిపాకలు తగులబెట్టటం,పాకల్లో ఉన్న పొగాకు నారు మూటలు, ఎరువులు తదితర సామాగ్రి కాలిపోయి సుమారు మూడు లక్షల వరకు నష్టపోయారని తెలిపారు. దళితుల సంక్షేమం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్మరించిందనే అపోహలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందిన టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ రాజ్యాంగ అమలు చేస్తూ దళితులకు రక్షణ లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఆరునెలల్లో ఐదుగురు దళితులు చనిపోవడమే కాకుండా సుమారు ఐదు వందలకు పైగా దళిత మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని, ఇది టీడీపీ దళితులు ఓట్లు వేసినందుకు గిఫ్ట్లు గా ఇచ్చారా అని ధ్వజమెత్తారు సంఘటన జరిగి నలభై ఎనిమిది గంటలు అయినా దళిత సర్పంచ్ గుడిసెలు తగల పెట్టిన వారిని అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం చేయడం బాధాకరమని, ఆస్తినష్టం జరిగిందని, పూర్తి నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నాం. వారి వెంట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్ణ, కనుమూరి నాగరాజు,రమణయ్య తదితరులు పాల్గొన్నారు.