నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి ఘన స్వాగతం లభిస్తోంది. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైయస్ జగన్కి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం రేగడగూడురు గ్రామంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేకు స్థానికులు ఎదురెళ్లి స్వాగతం పలికి విశేష ఆదరణ చూపుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, అర్హులకు అవి అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకుంటున్నారు. తమ దృష్టికి వచ్చిన చిన్నచిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగనన్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇవి చూసి ఓర్వలేక దుష్ట చతుష్టయం లేని సమస్యను ఉన్నట్టు చూపిస్తోందని విమర్శించారు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి, నేను సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ..ఎప్పుడైనా పేదలకు అమ్మ ఒడి, రైతు భరోసా, వైయస్ఆర్ చేయూత వంటి పథకాలు ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు అంబాల ప్రభాకర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి దేశం తిరుపంరెడ్డి, ఎంపీపీ లాలం రమేష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైయస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.