గుంటూరు: అనూష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. 7 నెలల క్రితం అనూష చనిపోతే లోకేష్కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని నిలదీశారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. నిందితుడిని 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. సీఎం వైయస్ జగన్ ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని మూడో రోజే అందించామని తెలిపారు. అనూష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందన్నారు. టీడీపీ హయాంలో నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి, తహసీల్దార్ వనజాక్షి, వైద్య విద్యార్థిని సంధ్య ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పి నరసరావుపేటలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న లోకేశ్ తండ్రి పంచాయితీలు చేశాడే కాని బాధితుల కుటుంబాలకు ఏమైనా న్యాయం చేశారా అని నిలదీశారు. ప్రస్తుతం నరసరావుపేటలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రమ్య విషాద ఘటన గుంటూరులో జరిగిందని, అంత బాధ్యత ఉంటే అక్కడే ధర్నా చేసుకోవాలని సూచించారు. రమ్య ఉదంతం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధ్యతగా స్పందించినా టీడీపీ నాయకులు శవాన్ని అడ్డుపెట్టుకుని నీచరాజకీయాలకు పాల్పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు వెంటనే రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించి సత్వర న్యాయం చేసిందన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశంసించిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి నేరుగా బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినా ఏనాడూ చంద్రబాబు బాధ్యతగా స్పందించిన దాఖలాలు లేవన్నారు.