ఉపాధ్యాయులే భావి భారత నిర్మాతలు  

ఉత్త‌మ ఉపాధ్యాయుల స‌న్మాన కార్య‌క్ర‌మంలో మంత్రి ఆర్కే రోజా

చిత్తూరు: భారతీయ సమాజం జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అక్షరాలుదిద్దించిన గురువుకే పెద్దపీట వేసింద‌ని, బావి భార‌త నిర్మాత‌లు ఉపాధ్యాయులేన‌ని మంత్రి ఆర్కే రోజా అన్నారు. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు ఏఎంసి కళ్యాణ  మండపంలో ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి ఆర్కే రోజా ఘ‌నంగా స‌త్క‌రించి అవార్డులు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి రోజామాట్లాడుతూ.. గురువును సాక్షాత్తూ దేవుడితో సమానంగా పూజిస్తోంద‌న్నారు. నేటి బాలలే.. రేపటి పౌరులు. ఆ పౌరులను బాధ్యతాయుత వ్యక్తులుగా.. బంగారు భవిష్యత్తుకు మార్గనిర్దేశకులుగా.. ప్రగతి రథ సారధులుగా నిలిపేవారే.. ఉపాధ్యాయులన్నారు. అందుకే శతాబ్దాల నాటి గురుకులాలైనా.. ఆన్‌లైన్ పాఠాల సంస్కృతి పెరుగుతున్న నేటి ఆధునిక యుగంలోనైనా.. బోధన ఒక పవిత్రమైన వృత్తిగా భాసిల్లుతోంద‌న్నారు.టీచర్స్ అంటే సమాజంలో గౌరవం ఇనుమడిస్తోంద‌న్నారు.  మన సమాజంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే స్థానం దక్కింది. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారికి బంగారు భవిష్యత్‌ను ఇచ్చే క్రమంలో కీలకపాత్ర టీచర్లదే అని కొనియాడారు.  మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని తల్లిదండ్రుల తరువాత  దైవంతో సమానంగా గౌరవించే వ్యక్తి ఉపాధ్యాయులంద‌రికీ పాదాభివందనాలు అని మంత్రి అన్నారు. అనంత‌రం ఉపాధ్యాయులతో మంత్రి సహపంక్తి భోజనం చేశారు.  కార్యక్రమంలో  డీఈవో, డివైఇఓ, ఎంఈఓ, ఎంపీపీ, మునిసిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ లు,   ఎంపీపీ, వైస్ ఎంపీపీలు,సర్పంచ్లు,ఎంపీటీసీలు, మార్కెట్, ఆలయ కమిటీల చైర్మన్లు , రాష్ట్ర డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top