జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆర్టీసీ సేవలు నిలిపివేత

రవాణా శాఖ మంత్రి పేర్ని నాని
 

విజయవాడ: జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆర్టీసీ సేవలను నిలిపివేస్తున్నామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరించారు. మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ.. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్టీసీ బంద్‌ కొనసాగుతుందన్నారు. ప్రధాన మంతి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ సేవలను రేపు నిలిపివేస్తున్నామన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఈ రోజు నుంచే నిలిపివేస్తున్నామని వివరించారు. ప్రైవేట్‌ బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు. ఇదే అదునుగా భావించి టికెట్‌ ధరలు పెంచి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసే ప్రైవేట్‌ వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దయచేసి జనతా కర్ఫ్యూకి అందరూ సహకరించాలని పేర్ని నాని కోరారు.

 

Back to Top