మెట్ట‌ప్రాంత రైతుల‌కు వైయ‌స్ఆర్ జ‌ల‌క‌ళ ఓ వ‌రం

రేపు ‘వైయ‌స్ఆర్‌‌ జలకళ’ప‌థ‌కం ప్రారంభం 

రూ.6 వేల కోట్ల‌తో గోడౌన్ల నిర్మాణం చేప‌డుతున్నాం

ప్ర‌తి మండలంలో కోల్డు స్టోరేజ్ ఏర్పాటు

మంత్రి క‌న్న‌బాబు

కాకినాడ‌:  సాగునీరు అందుబాటులో లేని మెట్ట, బీడు భూముల రైతుల‌కు వైయ‌స్ఆర్ జ‌ల‌క‌ళ ప‌థ‌కం ఒక వ‌రం లాంటిద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి క‌న్న‌బాబు పేర్కొన్నారు.   ‘వైయ‌స్ఆర్‌‌ జలకళ’ పథకాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఈ పథకంలో ప్రభుత్వమే ఉచితంగా బోర్లు తవ్వించి ఐదు లక్షల ఎకరాలను పూర్తి స్థాయిలో సాగులోకి తీసుకురానుంద‌ని చెప్పారు.  అందుబాటులో ఉన్న భూగర్భజల వనరులను ఉపయోగించుకుంటూ వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామ‌న్నారు. బోర్లు తవ్వించడానికి చిన్న, సన్నకారు రైతులు అప్పులు పాలవుతుండటాన్ని పాదయాత్ర సమయంలో చూసి చలించిన వైయ‌స్‌ జగన్‌.. ఉచిత బోర్ల పథకానికి హామీ ఇచ్చార‌ని, ఇచ్చిన మాట ప్ర‌కారం ‘వైయ‌స్ఆర్‌‌ జలకళ’ పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింద‌ని చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో ఈ పథకం ద్వారా సుమారు 2,00,000 బోర్లు తవ్వించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్ఆన‌రు.  ఈ పథకానికి రూ. 2,340 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశార‌ని,  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి, పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున డ్రిల్లింగ్‌ కాంట్రాక్ట్‌ ఏజెన్సీని ఇప్పటికే ఎంపిక చేశామ‌ని మంత్రి చెప్పారు.  కనీసం 2.5 ఎకరాల భూమి ఉన్న రైతు లేదా గరిష్టంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులు గ్రూపుగా ఏర్పడి బోరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.  త్వ‌ర‌లోనే ప్ర‌తి గ్రామంలో రైతు భ‌రోసా కేంద్రానికి అనుసంధానంగా రూ.6 వేల కోట్ల‌తో గోడౌన్ల నిర్మాణం చేప‌డుతున్నామ‌ని చెప్పారు. ప్ర‌తి మండలంలో కోల్డు స్టోరేజ్ ఏర్పాటు చేసేందుకు ప్ర‌ణాళిక రూపొందిస్తున్నార‌ని క‌న్న‌బాబు తెలిపారు.  
 

Back to Top