విజయవాడ: ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12 నుంచి జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, పల్నాడు జిల్లా క్రోసూర్లో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారని చెప్పారు. విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న విద్యా కానుక ఒక్కో కిట్కు రూ.2500 ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయనున్నామన్నారు. టెన్త్, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాల పేరుతో ప్రోత్సాహకాలు అందజేయనున్నామన్నారు. జూన్ 28వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అమ్మఒడి పథకం ప్రారంభం కానుందన్నారు. పిల్లలను బడులకు పంపించే తల్లుల ఖాతాల్లోకి సీఎం వైయస్ జగన్ నగదు జమ చేయనున్నారని వివరించారు. నాడు–నేడు మొదటి ఫేస్లో పూర్తయిన పాఠశాలల్లో డిజిటల్ విద్య అందుబాటులోకి రానుందన్నారు. ఈనెల 12 నుంచి పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ప్రారంభిస్తామని చెప్పారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. అదే విధంగా ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు తీసుకొస్తున్నామని, ఇందులో ఒక కాలేజీ కేవలం విద్యార్థినులకు మాత్రమేనని చెప్పారు. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని, అంతేకాకుండా రాగిజావ కూడా అందిస్తున్నామన్నారు.