విజయనగరం: పేదవాడికి ధైర్యాన్ని కల్పించేలా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఘోష ఆసుపత్రిలో బధిరులైన చిన్నారులకు శస్త్ర చికిత్సల ద్వారా వినికిడి శక్తి తెచ్చే శిబిరాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలకు వినికిడి పరికరాలను మంత్రి అందజేశారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వినికిడి కోసం ఒక చెవికి ఆపరేషన్ చేసే కార్యక్రమం చేపట్టారు. తండ్రి కంటే కొడుకు రెండు అడుగులు ముందుకు వేస్తూ రెండో చెవికి కూడా ఆపరేషన్ చేసే అవకాశం కల్పించారన్నారు.
హెల్త్ విషయంలో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఆరోగ్యశ్రీలో 3 వేలకు పైగా వ్యాధులకు చికిత్స అందిస్తున్నాం. ఇంకా ఏమైనా వ్యాధులు మిగిలిపోతే వాటిని కూడా చేర్చేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు.
దేశంలోనే ఎక్కువ మంది బధిరులు విజయనగరంలోనే ఉన్నారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇలాంటి సమస్యను ఏ విధంగా అధిగమించాలా అనే ఆలోచన చేస్తున్నాం. అందుకు గర్భం సమయంలోనే ఈ సమస్యను నివారించేందుకు ప్రోటీన్ ఫుడ్ ను ప్రభుత్వం సమకూరుస్తుంది. మేనరికాలు కూడా దూరంగా పెట్టండి. ఆ విధంగా చైతన్యవంతుల్ని చేయాలి. ఐదేళ్ల లోపు ఉన్న 500 మంది పిల్లలకు సీఎం ఆర్ ఎఫ్ నిధులు, ఆరోగ్య శ్రీ నుండి ఆపరేషన్స్ చేస్తున్నాం. రూ.30 కోట్ల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని, ఈ ఆవకాశం అందరూ వినియోగించుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.