విజయవాడ: చంద్రబాబు అవినీతి, దుబారా ఖర్చులతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మున్సిపల్ శాఖలోనే రూ. 15 వేల కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టారని మండిపడ్డారు. సచివాలయంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్ల నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. ప్రచార ఆర్భాటాలకు చంద్రబాబు వందల కోట్ల రూపాయలను వృథా చేశారని, చంద్రబాబు తీరు వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కృషిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజారంజక పాలన చేస్తున్న మా ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు సరికాదని సూచించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీ విధానంతో సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. సచివాలయాల ఆలోచన చంద్రబాబుకు వస్తే ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.