విజయవాడ: ప్రతి తరగతి గదికి పది నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి తరగతి గదికి పది నుంచి 12 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ.. ప్రతి విద్యార్థి మాస్కు ధరించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కంటైన్మెంట్ జోన్లలో పరీక్షల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామన్నారు. వచ్చే నెల 11 నుంచి 18వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద హెల్త్ అధికారులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.