తాడేపల్లి: చట్టానికి, న్యాయస్థానాల తీర్పులకు వ్యతిరేకంగా పోలీసులు కేసులు పెడుతున్నారు. న్యాయస్థానాల ఆదేశాలు లేకుండా విచారణ అధికారుల మీద కేసులు పెట్టడం కుదరదని ఇటీవల ఓ కేసులో హైకోర్టు బెయిల్ ఆర్డర్లో స్పష్టంగా చెప్పింది. అయినా హైకోర్టు ఆదేశాలను ఈ పోలీసులు లెక్క చేయడం లేదు. పదేపదే అత్యున్నత న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా పోలీసుల తీరు మారడం లేదు. వైయస్ జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా లింగయ్య అనే వ్యక్తి ప్రైవేట్ సఫారీ వాహనం ఢీకొని చనిపోయాడని ఎస్పీ స్వయంగా నెంబర్ తో సహా చెప్పారు. ఆ వాహన యజమాని గొట్టిపాటి హరీశ్, డ్రైవర్ సాయిబాబాను ఈనెల 18వ తేదీ రాత్రి అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశారు. 19న ఉదయం ఇద్దరు జామీన్ దారుల పూచీకత్తుతో స్టేషన్ బెయిల్ మీద వారిని పోలీసులు విడుదల చేశారు. ఇప్పటికీ ఆ వాహనం నల్లపాడు పోలీస్ స్టేషన్ వెనుకవైపున పార్కింగ్ చేసి ఉంది. కానీ నిన్న ఎస్పీ ప్రెస్మీట్ నిర్వహించి మాకు కొన్ని వీడియాలో లభించాయని ఒక వీడియోను ఆధారం చేసుకుని సెక్షన్లు చేంజ్ చేస్తున్నామని వివరించారు. సెక్షన్ ఆఫ్ లా కింద సెక్షన్ 105 బీఎన్ఎస్, సెక్షన్ బీఎన్ఎస్ 49, కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కోర్టులో ఆల్ట్రేషన్ మెమో వేసినట్టు తెలిసింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆ కారులో ప్రయాణించిన వ్యక్తులందర్నీ నిందితులుగా చేరుస్తూ ఈ ఆల్ట్రేషన్ మెమో కోర్టులో వేశారు. కారులో ప్రయాణిస్తున్న వారందరి మీదా కేసులు పెట్టడం చూస్తుంటే పోలీసులు ఎంత రాజకీయ ఒత్తిడితో పనిచేస్తున్నారో అర్థమవుతుంది. ఒక ఆర్టీసీ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే డ్రైవర్ మీద కేసు పెడతారా, ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరి మీదా కేసులు పెడతారా? ఆ వీడియోపై ప్రజల్లో అనుమానాలు కేసుకు ఆధారంగా తీసుకున్నామని పోలీసులు చెబుతున్న ఆ వీడియోపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. ఆ వీడియో ఏఐ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిందని ప్రచారం జరుగుతోంది. ఈ అంశాన్ని పోలీసులు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదు. పోలీసులు ప్రాతిపదికగా తీసుకున్న వీడియోకి ముందు 5 నిమిషాలు, తర్వాత 5 నిమిషాల వీడియోలు రిలీజ్ చేయాలి. వైయస్ జగన్ వాహనాన్ని నడిపింది కూడా ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్. అనేక ఏళ్లుగా ఆయన కార్లు నడపడంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తి. పోలీస్ విచారణలో తన కారు కింద వ్యక్తి పడిపోయినట్టు కూడా తెలియదని చెప్పాడు. ఒకవేళ నిజంగా ప్రమాదం జరిగిందని అనుకున్నా దానికి డ్రైవర్ పై బెయిలబుల్ సెక్షన్ కింద కేసు పెట్టి నోటీసులివ్వాలి. అంతేకానీ కారులో ఉన్నవారందరి మీదా కేసు పెట్టడం పూర్తిగా కక్షపూరితం. కారులో ఉన్నవారందరికీ తెలిసి కూడా నేరం చేసినట్టు పోలీసులు నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. పోలీసులు స్క్రిప్టును ఎందుకు మార్చారు? మొదటి రోజున టాటా సఫారీ వాహనం ఢీకొని చనిపోయాడని చెప్పి దాన్ని సీజ్ చేసిన పోలీసులు, మూడు రోజుల తర్వాత స్క్రిప్టును ఎందుకు మార్చారు? డ్రైవర్పై కేసు నమోదు చేస్తే ర్యాష్ అండ్ నెగ్లిజన్స్ డ్రైవింగ్ కింద నమోదు చేశారని అనుకోవచ్చు. విపరీతమైన క్రౌడ్ ఉన్న కారణంగా అక్కడ ర్యాష్ డ్రైవింగ్ కి అవకాశమే లేదు. కాబట్టి డ్రైవర్ మీద కూడా కేసు పెట్టే అవకాశం పోలీసులకు లేదు. పైపెచ్చు కారులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి సహా, ఎంపీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై కేసు పెట్టడం ముమ్మాటికీ కక్షపూరిత రాజకీయాలకు అద్దం పడుతోంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్కి ఆ మేరకు భద్రత కల్పించలేదు. రోప్ పార్టీ, మాజీ సీఎం వాహనానికి ముందుగా పైలట్ వాహనం, ఆయన చుట్టూ పోలీసు భద్రత వంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ పాటించలేదు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే అభిమానులు ఆయన కారుపైకి కూడా ఎక్కే పరిస్ధితులు నెలకొంటున్నాయి. చంద్రబాబు మీద కేసులు పెట్టలేదే? 2015, 2016లో సంవత్సరాల్లో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఆ సంఘటనల్లో చంద్రబాబు మీద కేసులు పెట్టారా? గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా 29 మంది అమాయక భక్తులు చనిపోయినా ఆయన మీద కేసు పెట్టలేదు. అదేవిధంగా 2022 డిసెంబర్లో చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభలో 8 మంది చనిపోయినా దానికి చంద్రబాబుని బాధ్యుడ్ని చేసి ఆనాటి వైయస్ జగన్ ప్రభుత్వం కేసు పెట్టలేదు. 2023 జనవరిలో గుంటూరులో చంద్రబాబు నిర్వహించిన మరో తెలుగుదేశం సమావేశంలో ముగ్గురు చనిపోయారు. ఆరోజు కూడా వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చంద్రబాబు మీద కక్షపూరితంగా కేసులు నమోదు చేయలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఇతర వైయస్సార్సీపీ నాయకుల మీద కక్షపూరితంగా నేటి కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే అందులో ప్రయాణించే వారి మీద కేసు పెట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని పరిశీలిస్తే దేశ చరిత్రలో ఒక్క కేసు కూడా కనపడలేదు. అంటే, రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం కొత్త అధ్యాయాలకు తెరతీస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో అక్రమ కేసులు పెట్టి వైయస్సార్సీపీ నాయకులను వేధించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కూటమి నాయకుల ఒత్తిడికి తట్టుకోలేక కొంతమంది పోలీసులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మా దృష్టికొచ్చింది. ఇలాంటి విధానం రాష్ట్రానికి మంచిది కాదు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే పార్టీలు ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే వ్యవస్థలను నాశనం చేయడంలో ఇదొక భాగం అవుతుంది. వ్యవస్థలను చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని గుర్తుంచుకోవాలి.